ఒక్క ఫోన్‌ కాల్‌తో కుటుంబం బలి

24 Dec, 2016 16:30 IST|Sakshi

బుర్ద్వాన్‌: 'మీ కూతురు మాకొద్దు. మీ సంబంధం మాకొద్దు. మీ అమ్మాయికి వేరొకరితో సంబంధం ఉందని తెలిసింది. మీ సంబంధాన్ని రద్దు చేసుకుంటున్నాం' అంటూ వచ్చిన ఒక్క ఫోన్‌ కాల్‌తో ఓ కుటుంబం మొత్తం నాశనమైంది. ఆ ఇంట్లోని వారంతా నిర్జీవులుగా మారారు. పెళ్లి ఖరారు అయ్యింది అంటూ అవతలి వారి నుంచి వచ్చే ఫోన్‌ కాల్‌ కోసం ఎదురు చూసిన ఓ తండ్రి చివరకు వినకూడని మాటలు విని నిర్ఘాంతపోయాడు. ఆ కోపంలో భార్యను, కూతురుని చంపి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో సుజల్‌ బరన్‌ నాగ్‌(62) అనే వ్యక్తి కూతురు సుదర్శన(23)కి వేరే ఊర్లోని అబ్బాయికి పెళ్లి కుదిరింది.

శుక్రవారం ఆ పెళ్లి ఖరారుకు సంబంధించి అబ్బాయి వాళ్ల నుంచి ఫోను రావాల్సి ఉంది. అయితే, ఫోన్‌ వచ్చింది కానీ, మాట్లాడిన అవతలి వ్యక్తి మాత్రం పెళ్లి సంబంధం క్యాన్సిల్‌ అని చెప్పాడు. కారణం అడిగితే సుజల్‌ కూతురుకి పరాయి వ్యక్తితో సంబంధం ఉందని చెప్పాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన సుజల్‌ ఈ విషయంలో తన భార్య మణిమాల(52)తో గొడవ పడ్డాడు. అలా రాత్రంత గొడవపడిన అతను అనంతరం భార్యను కూతురుని చంపేసి తాను కూడా ఉరేసుకొని చనిపోయాడు. భార్య, కూతురుని తానే చంపేసినట్లు ఆత్మహత్యకు ముందు ఓ లేఖలో పేర్కొన్నాడు. ఈ ఘటన చుట్టుపక్కలవారిని తీవ్రంగా కలిచి వేసింది. 

మరిన్ని వార్తలు