కరోనా డ్రగ్‌ అమ్మకానికి గ్రీన్‌ సిగ్నల్‌

21 Jun, 2020 12:15 IST|Sakshi

హెటిరో డ్రగ్స్‌ను అనుమతి

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఔషధాన్ని తయారుచేసినట్లు భారత్‌కు చెందిన గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్‌ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఔషధాన్ని విక్రయించేందుకు దేశీయ ఔషధ‌ కంపెనీలు సిప్లా, హెటిరోకు అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీజీసీఐ) అనుమతి పత్రాలను మంజూరు చేసినట్లు  ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో ఆదివారం ప్రకటించింది. ‘కోవిఫర్‌’ పేరుతో జనరిక్‌ మందు అమ్మకానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్లు పేర్కొంది. ఈ డ్రగ్‌ రాబోయే రెండో వారాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేసింది. (కరోనా చికిత్సకు గ్లెన్‌మార్క్‌ ఔషధం)

సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరకు మందును అందుబాటులో తీసుకువస్తామని హెటిరో ప్రతినిధులు తెలిపారు. ఇంజక్షన్‌ రూపంలో ‘కోవిఫర్‌ 100 ఎంజీ’ మార్కెట్‌లోకి రానుందని ఫార్మా కంపెనీ ప్రకటించింది. కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారందరికీ ఈ ఇంజెక్షన్‌ పనిచేస్తుందని తెలిపింది. దీంతో కోవిడ్‌కు మందును కనిపెట్టిన ఘనత హైదరాబాద్‌ హెటిరోకి దక్కనుంది. ఇక కరోనా యాంటీ డ్రగ్‌ సిప్లా, హెటిరో సంస్థల ఆధ్వర్యంలో మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. (కరోనాకు హైదరాబాద్‌ మెడిసిన్‌!)

మరిన్ని వార్తలు