నేడే సూర్యగ్రహణం

26 Dec, 2019 01:25 IST|Sakshi

దక్షిణ భారతంలో అధికం

నేరుగా చూడొద్దంటున్న శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ: ఈ ఏడాదికి గుడ్‌బై కొట్టేస్తూ 2020 కొత్త సంవత్సరానికి స్వాగత ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో సూర్యగ్రహణం సంభవించడం అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల సూర్యగ్రహణం వస్తుంది. గురువారం నాడు సంభవించే వార్షిక సూర్యగ్రహణం ఈ సారి భారత్‌లో చాలా ప్రాంతాల్లో కనిపించనుంది. దక్షిణ భారత దేశంలో ఈ సారి సూర్యగ్రహణం అధికంగా కనిపించనుంది. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళలో సూర్యగ్రహణం ప్రభావం ఎక్కువ. అయితే ఇది సంపూర్ణ సూర్య గ్రహణం కాదు. ఆకాశంలో సూర్యుడు ఒక ఉంగరంలా మారే అద్భుత దృశ్యం రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ఆవిష్కృతం కానుంది. భూమికి చంద్రుడు చాలా దూరంగా ఉండడం వల్ల ఈ సారి పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే ఏర్పడుతోంది.

ఎప్పటి నుంచి ఎప్పటివరకు..
► ఈ సారి సూర్యగ్రహణం భారత్‌లో 3 గంటల 12 నిమిషాల సేపు కొనసాగుతుంది.  
► భారత కాలమాన ప్రకారం ఉదయం 8:04గంటలకు ప్రారంభమవుతుంది
► ఉచ్ఛస్థితికి ఉదయం 9:27కి చేరుకుంటుంది.
► ఉదయం 11:05గంటలకు ముగుస్తుంది.  

భారత్‌లో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ కనిపించే ప్రాంతాలు
► ఊటీ, మంగళూరు, కోయంబత్తూర్, శివగంగ, తిరుచిరాపల్లి, కసరాగాడ్‌

భారత్‌లో పాక్షిక సూర్యగ్రహణం ఎక్కడెక్కడ?
ఢిల్లీ, పుణె, జైపూర్, లక్నో, కాన్పూర్,    నాగపూర్, ఇండోర్, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, సూరత్, భోపాల్, విశాఖపట్నం, లూథియానా, ఆగ్రా

నేరుగా చూడొద్దు
► కంటితో నేరుగా సూర్యగ్రహణం చూడడం అత్యంత ప్రమాదం. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల వల్ల కంటికి ఎంత మాత్రమూ మంచిది కాదు.
► సూర్యగ్రహణాన్ని నేరుగా చూడడం వల్ల కంటి రెటినాపై  ప్రభావం చూపుతుంది.  
► నల్ల కళ్లద్దాలు, మార్కెట్‌లో లభించే ఇతర సోలార్‌ ఫిల్టర్స్‌తో సూర్యగ్రహణం చూడకూడదు.  
► కెమెరా, టెలిస్కోప్, బైనాక్యులర్స్‌ ఇతర పరికరాలతో చూడొద్దు.  
► మార్కెట్‌లో ప్రత్యేకంగా సూర్యగ్రహణం చూడడానికి తయారు చేసే సోలార్‌ ఫిల్టర్స్‌ ద్వారా మాత్రమే చూడాలి.
► వెల్డర్స్‌ గ్లాస్‌ నెంబర్‌ 14 సూర్యగ్రహణం చూడడానికి అత్యుత్తమమైనది. ఇది కంటికి అత్యంత రక్షణ కల్పిస్తుందని మధ్యప్రదేశ్‌లో బిర్లా ప్లానిటోరియం శాస్త్రవేత్త దేబిప్రసాద్‌ దౌరి చెప్పారు.

ఏయే దేశాల్లో
భారత్, శ్రీలంక, యూఏఈ, ఒమన్, సౌదీ అరేబియా, ఖతర్, మలేసియా, ఇండోనేసియా, సింగపూర్‌ , తూర్పు రష్యా, ఆస్ట్రేలియా

మరిన్ని వార్తలు