చైనాకు దీటైన జవాబు

23 Jul, 2020 01:48 IST|Sakshi

వాయుసేన సదస్సులో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం విషయంలో భారత వాయుసేన చురుకుగా వ్యవహరించి ప్రత్యర్థికి బలమైన సందేశాన్ని పంపిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ కొనియాడారు. తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో యుద్ధవిమానాలను వేగంగా మోహరించడం ద్వారా వాయుసేన తన యుద్ధ సన్నద్ధతను చాటిందని, తద్వారా పాకిస్థాన్‌పై భారత్‌ జరిపిన బాలాకోట్‌ దాడిని చైనాకు గుర్తు చేసిందని ఆయన బుధవారం ఢిల్లీలో మొదలైన వాయుసేస సదస్సులో అన్నారు.

వాయుసేన ఉన్నతస్థాయి అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో దేశ ప్రజలందరి నమ్మకం త్రివిధ దళాలపై ఉందని రాజ్‌నాథ్‌ అన్నారు. సరిహద్దులు దాటి మరీ బాలాకోట్‌పై వాయుసేన జరిపిన దాడిని గుర్తు చేస్తూ వాయుసేన ఈ విషయంలో అత్యంత నైపుణ్యంతో వ్యవహరించిందని అన్నారు.  (చైనా వ్యాక్సిన్పై స్పందించిన ట్రంప్)

తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో వాయుసేన యుద్ధ విమానాల మోహరింపు ఇలాంటిదేనని మంత్రి పేర్కొన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వివరించిన మంత్రి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా వాయుసేన సిద్ధంగా ఉండాలని కోరారు. శత్రువులను ఎదుర్కొనేందుకు వాయుసేన సన్నద్ధంగా ఉంటుందని సదస్సులో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ బధూరియా స్పష్టం చేశారు.

40 వేల మంది చైనా సైనికుల తిష్ట!
తూర్పు లద్ధాఖ్‌ సెక్టార్‌లో భారత్‌–చైనా సరిహద్దు నుంచి తమ బలగాలను వెనక్కి మళ్లిస్తున్నామని పైకి చెబుతున్న చైనా ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. బలగాల మళ్లింపుపై ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని చైనా పీపుల్స్‌ రిబరేషన్‌ ఆర్మీ లెక్కచేయడం లేదు.

ప్రస్తుతం అక్కడ దాదాపు 40,000 మంది చైనా సైనికులు తిష్ట వేసినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. భారీ ఎత్తున ఆయుధ సామగ్రిని సైతం కలిగి ఉన్నట్లు తెలియజేసింది. భారత్‌–చైనా కమాండర్ల స్థాయి చర్చలు గత వారంలోనే జరిగాయి. సరిహద్దు ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించుకున్నారు. అయినా చైనా తన పంథా మార్చుకోవడం లేదు. (చైనా కాన్సులేట్లో త్రాల కాల్చివేత)

మరిన్ని వార్తలు