44 ఏళ్ల నాటి విమానం నడపాలా? 

21 Aug, 2019 08:04 IST|Sakshi

ఐఏఎఫ్‌ చీఫ్‌ ధనోవా వ్యాఖ్య  

న్యూఢిల్లీ: నాలుగు దశాబ్దాల క్రితం నాటి కార్లను ఇప్పుడూ ఎవరూ రోడ్లపై నడపడం లేదనీ, అలాంటప్పుడు 44 ఏళ్ల నాటి యుద్ధ విమానాలను ఎందుకు ఉపయోగించాలని భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) అధిపతి, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌  బీఎస్‌ ధనోవా మంగళవారం ప్రశ్నించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సమక్షంలో ఢిల్లీలో ఓ కార్యక్రమంలో ధనోవా ఇలా మాట్లాడారు. మిగ్‌–21 యుద్ధ విమానం గురించి ఆయన ప్రస్తావిస్తూ, ‘ఈ విమానాన్ని 1973–74లో వాయుసేనలో చేర్చారు. ప్రస్తుతం వీటిలో ఐదో తరం యుద్ధ విమానాలు వచ్చేశాయి. ఆ తర్వాతి తరం విమానాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి.

ఇలాంటి పాత విమానాలతో మనం విజయం సాధించలేకపోతే దానిని భరించగలమా? యుద్ధం లేనంత మాత్రాన మొత్తం ఆధునిక సాంకేతికత స్వదేశంలో తయారయ్యేంత వరకు మనం వేచి ఉండలేం. అయితే రక్షణ వస్తువులను అన్నింటికీ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కూడా తెలివైన పని కాదు. దాదాపు 44 ఏళ్ల క్రితం నాటి మిగ్‌–21 ఎంఎఫ్‌ విమానాన్ని నేను ఇంకా నడపగలుగుతున్నాను. కానీ అంత పాత కారును మీరెవ్వరూ ఇప్పుడు నడపడం లేదని నేను కచ్చితంగా చెప్పగలను’ అని ధనోవా అన్నారు. భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్‌–16 యుద్ధ విమనాన్ని కూలి్చనప్పుడు ఉపయోగించింది కూడా ఈ మిగ్‌–21 విమానాన్నే.  

మరిన్ని వార్తలు