లద్దాఖ్‌లో పర్యటించనున్న రాజ్‌నాథ్‌ సింగ్

15 Jul, 2020 17:16 IST|Sakshi

సాక్షి, న్యూడిల్లీ : భారత్‌-చైనా సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం లద్దాఖ్‌లో పర్యటించనున్నారు. ఆయతో పాటు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే కూడా లద్దాఖ్‌ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వాస్తవధీనరేఖ(ఎల్‌ఏసీ) వద్ద పరిస్థితిని రాజ్‌నాథ్‌ సమీక్షించనున్నారు. అలాగే సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులను మంత్రి కలవనున్నారు. అలాగే ఆ మరుసటి రోజు రాజ్‌నాథ్‌ సింగ్‌ శ్రీనగర్‌లో పర్యటిస్తారు. నియంత్రణ రేఖ, శ్రీనగర్‌ లోయలో నెలకొన్న పరిస్థితిని ఆయన సమీక్షించనున్నారు. (‘నైపుణ్యాలే స్వావలంబన భారతావనికి శక్తి’)

కొద్ది రోజులే కిందటే రాజ్‌నాథ్‌ సింగ్‌ లద్దాఖ్‌ పర్యటను వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. అది కాస్త వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈలోపే ప్రధాని మోదీ లద్దాఖ్‌లో ఆకస్మిక పర్యటన చేపట్టారు.  విస్తరణ కాంక్షతో ఉన్న శక్తులు పరాజయం పాలవడమో, పలాయనం చిత్తగించడమో జరిగిందని చరిత్ర చెబుతోందని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన సైనికుల త్యాగాలను కొనియాడారు. వారి ధైర్య సాహసాలకు సెల్యూట్‌ చేశారు.(కశ్మీర్‌లో కలకలం.. బీజేపీ కార్యకర్త కిడ్నాప్‌)

మరోవైపు తూర్పు లద్దాఖ్‌లోని వివాదస్పద ప్రాంతాల నుంచి ఇరు దేశాల బలగాలు ఎప్పటిలోగా వెనక్కి వెళ్లాలన్న దానిపై ప్రణాళిక రూపొందించేందుకు భారత్‌-చైనా  మిలటరీ కమాండర్లు మంగళవారం సమావేశమై 10 గంటలపాటు సుధీర్ఘంగా చర్చించారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ అధికారుల స్థాయిలో జరిగిన ఈ నాలుగో సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ వెంట ఉన్న సాయుధ బలగాలు, ఆయుధాలను సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు.(సెల్యూట్‌.. బ్రేవ్‌ హార్ట్స్‌!)

మరిన్ని వార్తలు