ఈ రూట్లలో నో వెయిటింగ్‌ లిస్టు

31 Dec, 2019 03:01 IST|Sakshi

ఐదేళ్లలో ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–కోల్‌కతా మార్గాల్లో..

రైల్వే బోర్డు చైర్మన్‌ వెల్లడి

న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–కోల్‌కతా మార్గాల్లో ప్రయాణించే రైళ్లలో వెయిటింగ్‌ లిస్టు ఉండదని రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌ యాదవ్‌ చెప్పారు. ఈ మార్గాల్లో ప్రత్యేక సరుకు రావాణా కారిడార్లు (డీఎఫ్‌సీ) 2021 కల్లా పూర్తి కానున్న నేపథ్యంలో రైళ్ల రద్దీ తగ్గుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. రూ.2.6 లక్షల కోట్లతో నిర్మించనున్న డీఎఫ్‌సీల నిర్మాణం పూర్తయితే సరుకు రవాణా రైళ్లు ఈ మార్గాల్లో వెళ్తాయి. దీంతో రైళ్ల వేగం పెంచడంతోపాటు ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు రైళ్లను నడపవచ్చాన్నారు.

ఫలితంగా ప్రయాణికులకు వెయిటింగ్‌ లిస్టు ఉండదని పేర్కొన్నారు. రైళ్లలో నేరాలను తగ్గించేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వినోద్‌ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి దీనిని అమలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 2022 మార్చి నాటికల్లా అన్ని రైల్వే స్టేషన్లు, బోగీల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆందోళనల్లో రైల్వేకు వాటిల్లిన రూ.80 కోట్ల ఆస్తి నష్టాన్ని బాధ్యులైన వారి నుంచే వసూలు చేస్తామని వినోద్‌ యాదవ్‌ సోమవారం ప్రకటించారు. ఇందులో తూర్పు రైల్వేకు రూ.70 కోట్లు, ఈశాన్య రైల్వేకు రూ.10 కోట్ల నష్టం జరిగింది.

మరిన్ని వార్తలు