పార్టీ కార్యాలయం ఎదుటే భార్యపై చేయి చేసుకున్న నేత

20 Sep, 2019 08:46 IST|Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ నేత ఒకరు మాజీ మహిళా మేయర్‌పై చేయి చేసుకున్నారు. పార్టీ కార్యాలయం ఎదుటే ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. వివరాలు.. బీజేపీ మెహ్రౌలీ అధ్యక్షుడు ఆజాద్‌ సింగ్‌.. దక్షిణ ఢిల్లీ మాజీ మేయర్‌, తన భార్య అయిన సరితా చౌదరిపై చేయి చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో బీజేపీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ పార్టీ సీనియర్‌ నాయకులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ఆజాద్‌ సింగ్‌, అతని భార్య కూడా హాజరయ్యారు. అయితే ఈ దంపతులు మధ్య గత కొన్నేళ్లుగా విడాకులు వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో పార్టీ సమావేశానికి హాజరైన వీరు ఏదో విషయం గురించి గొడవపడ్డారు. అది కాస్తా ముదిరి చేయి చేసుకునే వరకు వెళ్లింది.
 

దీని గురించి ఆజాద్‌ మాట్లాడుతూ.. ‘నా భార్యే మొదట నాతో గొడవపడటం ప్రారంభించింది. తనే నా మీద దాడి చేసింది.. దాంతో నన్ను నేను కాపాడుకోవడం కోసం ఆమెను తోసేశాను’ అని చెప్పుకొచ్చాడు. ఈ విషయం గురించి పార్టీ సీనియర్‌ నేతలు మాట్లాడుతూ... ‘ఇది భార్యభర్తల విషయం. దీనికి, పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వారి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు జవదేకర్‌ అక్కడ లేరు. ఆజాద్‌ దంపతులు కూడా ఇలా బహిరంగంగా కొట్టుకుంటారని అనుకోలేదని’ తెలిపారు. దీని గురించి పోలీసులను సంప్రదించగా.. ఆ విషయం గూర్చి తమకు తెలియదని.. ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

>
మరిన్ని వార్తలు