పెళ్లి కూతురిపై దుండగుల కాల్పులు

18 Jan, 2019 12:20 IST|Sakshi

న్యూఢిల్లీ : మరికొన్ని క్షణాల్లో తమ కూతురు వివాహ బంధంలోకి అడుగుపెడుతుందని సంబర పడుతున్న ఓ కుటుంబానికి ఊహించని పరిణామం ఎదురైంది. ఎంతో ఆనందంగా పెళ్లి వేదిక వద్దకు చేరుకున్న పెళ్లికూతురి కాళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఢిల్లీలోని షకార్‌పూర్‌లో గురువారం చోటుచేసుకుంది.

వివరాలు.. షకార్‌పూర్‌కు చెందిన పూజ అనే యువతికి భరత్‌ అనే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో గురువారం పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. పెళ్లికి ముందు నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత.. పూజ వేదిక వద్దకు చేరుకునే క్రమంలో ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినపడింది. ఏమైందో తెలుసుకునే లోపే గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కాళ్లపై తుపాకీతో కాల్చి పారిపోయారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం పూజను తిరిగి మండపానికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు పెళ్లి తంతును పూర్తి చేశారు. ఈ విషయంపై ఆమె భర్త భరత్‌ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా గతంలో కూడా ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. గతేడాది నవంబరులో... పెళ్లి మండపానికి ఊరేగింపుగా బయల్దేరిన ఓ యువకుడిపై కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే పెళ్లి జరిగిన తర్వాతే అతడు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు.

మరిన్ని వార్తలు