ప్రధాని మోదీతో సీఎం కేజ్రీవాల్‌  భేటీ

3 Mar, 2020 13:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ భేటీ అయ్యారు. మంగళవారం ఆయన పార్లమెంట్‌ భవన్‌లో మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరు పలు కీలక అశాలపై చర్చించారు. ఢిల్లీ అల్లర్లపై చర్చించారు.  ప్రధానంగా ఢిల్లీ అల్లర్లు, కోవిడ్-19 (కరోనా) వైరస్‌‌‌ నిరోధానికి సమష్టిగా కలిసి పనిచేయడంపై  చర్చించారు.

(చదవండి : పార్లమెంట్‌లో ఢిల్లీ అల్లర్ల రగడ)

సమావేశానంతరం మీడియాతో సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఢిల్లీ అల్లర్లు, కరోనా వైరస్పై ఇరువురం చర్చించామని తెలిపారు. ఢిల్లీ అల్లర్లకు ఎవరు కారణమైనా, ఏ పార్టీకి చెందినవారైనా వారిని కఠినంగా శిక్షించాలని ప్రధానికి తాను చెప్పానని అన్నారు. దేశ రాజధానిలో ఇలాంటి చర్యలు మరోసారి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని కోరానని చెప్పారు.  అల్లర్ల నియంత్రణకు ఢిల్లీ పోలీసుల పనితీరు బాగుందని కితాబిచ్చారు. 

 కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు కలసికట్టుగా పని చేయడంపై కూడా ఇరువురం చర్చించామని కేజ్రీవాల్ తెలిపారు. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోందని... ఇప్పటికే ఢిల్లీ, తెలంగాణలో రెండు కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి విస్తరిస్తోందని తెలిపారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టిన అనంతరం ప్రధానిని కలుసుకోవడం ఇదే ప్రథమం. ఢిల్లీ అల్లర్ల అనంతరం కూడా వీరిద్దరు సమావేశం కావడం ఇదే మొదటిసారి.

మరిన్ని వార్తలు