నిర్భయ కేసు: తాజా పిటిషన్‌.. నోటీసులు!

18 Mar, 2020 17:12 IST|Sakshi

న్యూఢిల్లీ: మరో రెండు రోజుల్లో నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు దోషుల ఉరిశిక్ష అమలుకు రంగం సిద్ధమైన వేళ వారు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ కోర్టు తలుపుతట్టారు. తాము దాఖలు చేసిన పలు పిటిషన్లు, అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్న కారణంగా... రెండోసారి క్షమాభిక్ష కోరే అవకాశాలు పరిశీలించాల్సి ఉన్నందున ఉరిని నిలుపుల చేయాలని కోరారు. ఈ క్రమంలో నిర్భయ దోషుల తాజా పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం విచారించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తీహార్‌ జైలు అధికారులు, ప్రభుత్వ న్యాయవాదికి నోటీసులు జారీ చేసింది. కాగా 2012, డిసెంబరు 16 నాటి నిర్భయ అత్యాచార కాండలో ఆరుగురు వ్యక్తులు దోషులుగా తేలగా... ప్రధాన దోషి రామ్‌ సింగ్‌ తీహార్‌ జైలులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మరో దోషి మైనర్‌ కావడంతో సాధారణ జైలు శిక్ష తర్వాత అతడిని విడుదల చేశారు. (నిర్భయ కేసు: విడాకులు కోరిన అక్షయ్‌ భార్య)

ఇక మిగిలిన నలుగురు దోషులు పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, ముఖేశ్‌ సింగ్‌, అక్షయ్‌ ఠాకూర్‌లకు ఉరిశిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును ఖరారు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయగా.. ఇప్పటికే మూడుసార్లు వారిని ఉరితీసేందుకు డెత్‌ వారెంట్లు జారీ అయ్యాయి. అయితే ఎప్పటికప్పుడు వారు పిటిషన్లు దాఖలు చేస్తుండటంతో ఉరి వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మార్చి 20న ఉదయం ఆ నలుగురికి మరణ శిక్ష విధించాలనే ఆదేశాల నేపథ్యంలో వరుసగా మరోసారి పిటిషన్లు దాఖలు చేస్తూ ఈసారి కూడా శిక్ష అమలు తేదీని వాయిదా వేసేందుకు దోషులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వారిని ఉరి తీస్తారా లేదా అన్న అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. (నేనప్పుడు అసలు ఢిల్లీలో లేను: నిర్భయ దోషి)

మరో ట్విస్టు: ఐసీజేకు నిర్భయ దోషులు!

శరీరమంతా రక్తం.. తల మీద చర్మం ఊడిపోయి

>
మరిన్ని వార్తలు