కరోనా పేషంట్లకు మంచాలు లేవు.. స్పందించిన మంత్రి

6 Jun, 2020 08:33 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా పేషంట్ల కొరకు దాదాపు 5000 మంచాలు సిద్ధంగా ఉన్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ తెలిపింది. రాజధానిలో కరోనా పేషంట్ల కోసం ఆస్పత్రుల్లో మంచాలు లేవంటూ వచ్చిన వార్తలను ఆ పార్టీ ఖండించింది. ఈ సందర్భంగా ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి dc‌ మాట్లాడుతూ.. ‘కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు కరోనా పేషంట్లను చేర్చుకోవడానికి నిరాకరించాయి. దాంతో ఢిల్లీలో కరోనా పేషంట్లకు సరిపడా మంచాలు అందుబాటులో లేవంటూ తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. వాస్తవం ఏంటంటే ప్రస్తుతం ఢిల్లీలో కరోనా పేషంట్ల కోసం 5 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయి. గత మూడు రోజుల నుంచి దాదాపు 1000 మంది కరోనా పేషంట్లు వేరు వేరు ఆస్పత్రుల్లో చేరారు. బెడ్లు లేకపోతే ఇది ఎలా జరిగేది’ అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికి కూడా 5వేల పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. (కరోనా : కొత్త యాప్‌ ప్రారంభించిన ఢిల్లీ సీఎం)

కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు పేషంట్ల వివరాలను ఎప్పటికప్పుడు ఢిల్లీ ప్రభుత్వ  యాప్‌లో పొందుపర్చడం లేదని సత్యేంద్ర జైన్‌ తెలిపారు. అందుకే ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ ద్వారా త్వరలోనే ఏయే హా‍స్పిటల్‌లో ఎన్నెన్ని పడకలు ఖాళీగా ఉన్నాయో వంటి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఢిల్లీలో కరోనా కేసులు 26,000 మార్కును దాటినందున తమకు సకాలంలో చికిత్స అందించడం లేదంటూ రాజధానిలోని పలువురు కరోనావైరస్ రోగులు, వారి కుటుంబాలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ స్పష్టత ఇచ్చింది. ఢిల్లీలో శుక్రవారం 1,330 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 708కి పెరిగిందని అధికారులు తెలిపారు.
(ఆ విమానంలో మొత్తం ఆరు సీట్లే..)

మరిన్ని వార్తలు