జనవరి 22న ఉరి శిక్ష అమలు ఉండదు - ఢిల్లీ ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ హత్యాచార ఘటనలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్భయ సామూహిక అత్యాచారం హత్య కేసులో ఒక దోషి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసినందున జనవరి 22న ఉరిశిక్ష అమలు జరగదని ఢిల్లీ హైకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. జైళ్ల నిబంధనల ప్రకారం ఉరి శిక్ష పడిన కేసులో దోషుల మెర్సీ పిటిషన్ కోసం వెయిట్ చేయాల్సి అవసరం ఉందని, ఈ నేపథ్యంలో ఈ శిక్షను అమలు చేయలేమని బుధవారం పేర్కొంది. మరణ శిక్షరద్దుపై ముకేశ్, వినయ్ శర్మ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ ముందుస్తుదని తెలిపింది. అనంతరం తదుపరి విచారణ మధ్యాహ్నానికి (భోజన విరామం తరువాత) వాయిదా పడింది.
2012 నిర్భయ కేసులో నలుగురు దోషులు వినయ్ శర్మ (26), ముకేశ్ (32), అక్షయ్ కుమార్ సింగ్ (31), పవన్ గుప్తా (25) ల ఉరి శిక్ష జనవరి 22న అమలు చేయలేమని, ప్రభుత్వం, తీహార్ జైలు అధికారుల స్టాండింగ్ కౌన్సెల్ న్యాయవాది రాహుల్ మెహ్రా కోర్టుకు చెప్పారు. కేవలం దోషి పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్ధనను రాష్ట్రపతి తిరస్కరించిన తరువాతనే మరణ శిక్ష అమలుపై తుది నిర్ణయం వుంటుందని పేర్కొన్నారు. అప్పటివరకు నలుగురు దోషులలో ఎవరినీ జనవరి 22 న ఉరితీయలేమని వారు తేల్చి చెప్పారు.
చదవండి : నిర్భయ దోషులు : పలు సంచలన విషయాలు