బుల్లెట్‌ దిగినా.. పెళ్లి ఆగలేదు!

20 Nov, 2018 15:14 IST|Sakshi
పెళ్లి వేడుకలో బాదల్‌ (కర్టెసీ : ఇండియా టుడే)

సాక్షి, న్యూఢిల్లీ : పెళ్లి మండపానికి బయల్దేరిన ఓ యువకుడికి ఊహించని పరిణామం ఎదురైంది. ఎంతో ఆనందంగా ఊరేగింపుతో వధువును చేరేందుకు వెళ్తున్న అతడిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన ఢిల్లీలోని మదన్‌గిర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.... ఖాన్‌పూర్‌ ఏరియాకు చెందిన బాదల్‌ అనే వ్యక్తికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా బంధువులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి మండపానికి బయల్దేరాడు.

ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగులు అతడిపై కాల్పులకు తెగబడ్డారు. అయితే డీజే శబ్దం ఎక్కువగా ఉండటంతో ఎవరూ కూడా ఈ విషయాన్ని గమనించలేదు. ఈ ఘటనలో బాదల్‌ భుజానికి బుల్లెట్లు దిగడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో వెంటనే అతడు ఈ విషయాన్ని బంధువులకు తెలపగా దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సుమారు మూడు గంటలపాటు చికిత్స జరిగిన అనంతరం వివాహ వేదిక వద్దకు చేరుకున్న బాదల్‌.. గాయంతోనే పెళ్లి తంతు పెళ్లి పూర్తి చేశాడు. ఆ తర్వాత సర్జరీ నిమిత్తం ఆస్పత్రికి వెళ్లాడు. కాగా ఈ ఘటనపై బాదల్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు