గణతంత్ర వేడుకలు : ఢిల్లీలో హైఅలర్ట్‌

24 Jan, 2018 17:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గణతంత్ర వేడుకలకు ఆసియాన్‌ దేశాధినేతలు ముఖ్య అతిధులుగా హాజరవనుండటంతో ఉగ్రవాదుల నుంచి ముప్పు ఎదురవచ్చన్న నిఘా సంస్థల హెచ్చరికలతో ఢిల్లీలో హైఅలర్ట్‌ విధించారు. దేశరాజధానిలో శుక్రవారం రిపబ్లిక్‌ దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన క్రమంలో జరిగే రిపబ్లిక్‌ దినోత్సవ వేడుకలకు తొలిసారిగా ప్రపంచ నేతలు పలువురు తరలివస్తున్నారు.

ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడ, వియత్నాం ప్రధాని న్యూయెన్‌ ఫుక్‌, మయన్మార్‌ స్టేట్‌ కౌన్సెలర్‌ అంగ్‌ సాన్‌ సూకీ, లావోస్‌ ప్రధాని సిసోలిత్‌, మలేషియా ప్రధాని నజీబ్‌ రజాక్‌, ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు చన్‌ ఓచా, బ్రూనై సుల్తాన్‌ హసనాయ్‌ బొల్కియా సహా ఉన్నతస్ధాయి విదేశీ ప్రతినిధులు రానుండటంతో భద్రతా సంస్ధలు మునుపెన్నడూ లేని రీతిలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

వేడుకల నేపథ్యంలో ఉగ్ర దాడుల ముప్పు పొంచిఉందని, అదే సమయంలో పాక్‌తో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉగ్రవాదుల కదలికలు పెరగడాన్ని ప్రస్తావిస్తూ నిఘా సంస్థలు హెచ్చరించాయి. హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలోనిజామా మసీదు, బాట్లా హౌస్‌, కృష్ణనగర్‌, అర్జున్‌ నగర్‌ సహా ఉగ్ర కదలికలపై అనుమానాలున్న పలు కాలనీల్లో, వ్యూహాత్మక ప్రదేశాల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. 

మరిన్ని వార్తలు