ఢిల్లీ పోలీసులకు రాష్ట్ర హైకోర్టు క్లాస్‌!

3 Jun, 2020 15:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ప్రధానంగా జైళ్లు ఉన్నవే నేరస్తులను శిక్షించేందుకు, సమాజానికి ఏదో సందేశం ఇవ్వడం కోసం నిందితులను నిర్బంధించడానికి కాదు’ అని ఢిల్లీ హైకోర్టు సోమవారం నాడు పోలీసులనుద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. జాతీయ మానవ హక్కుల సంఘం సేకరించిన లెక్కల ప్రకారం 75 శాతం మంది నిందితులు జైళ్లలోనే మగ్గుతున్నారు. కాగా, పింజ్రా ఫెమినిస్ట్‌ గ్రూపునకు చెందిన నాయకురాలు దేవంగన కలితకు మంగళవారం నాడే ఢిల్లీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయినా ఆమెను జైలు నుంచి విడుదల చేయలేదు. మరో కేసు ఆమె మీద పెండింగ్‌లో ఉండడమే అందుకు కారణం. గత రెండు వారాల్లో ఆమెను మూడుసార్లు అరెస్ట్‌ చేశారు. దేవంగనను ఢిల్లీ పోలీసులు చీటికి మాటికి అరెస్ట్‌ చేస్తున్నారు. ఏ సామాజిక సమస్యలపై ఆమె రోడ్డు మీదకు వచ్చినా అరెస్ట్‌ చేసి జైలుకు తీసుకెళుతున్నారు.
(చదవండి: మాస్క్‌లు లేని నూతన జంటకు పదివేల ఫైన్‌)

భారత్‌లోని జైళ్ల గదులు ఇప్పటికే 114 శాతం ఖైదీలతో కిక్కిరిసి పోయి ఉండగా, సామాజిక కార్యకర్తలను పోలీసులు చీటికి మాటికి అరెస్ట్‌ చేస్తున్నారు. దేశంలో కరోనా మహమ్మారి భయాందోళనలు సష్టిస్తున్న నేటి పరిస్థితుల్లో జైళ్లు కిక్కిరిసి పోవడం ఎంత ప్రమాదరకమో ఊహించవచ్చు. చెన్నైలోని పుజాల్‌ జైలు కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్‌గా మారింది. ఆ జైలులో 47 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.  నేరాలను పరిష్కరించాల్సిన పోలీసులు ఆ విషయాన్ని పట్టించుకోకుండా అనుమానితులకు సందేశం ఇవ్వడం కోసం వారిని జైల్లో పెడుతున్నట్లున్నారని ఢిల్లీ కోర్టు విమర్శించింది. ఓ పక్క లాక్‌డౌన్‌ను ఉపయోగించుకొని ఢిల్లీ పోలీసులు గత ఫిబ్రవరి నెలలో జాతీయ పౌరసత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొన్న ప్రజలను వెతికి పట్టుకుంటున్నారు. జైళ్లకు పంపుతున్నారు. కరోనాను కట్టడి చేయడంలో దేశంలోని హైకోర్టులే సున్నితంగా వ్యవహరిస్తున్నాయి.

మరిన్ని వార్తలు