సుప్రీం తీర్పు : డ్యాన్స్‌తో అదరగొట్టిన హోటల్‌ స్టాఫ్‌

6 Sep, 2018 17:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరం కాదని, గే సెక్స్‌కు చట్టబద్ధత కల్పిస్తూ సుప్రీం కోర్టు వెల్లడించిన సంచలన తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని కొనియాడుతున్నారు. సుప్రీం తీర్పు వెల్లడయ్యాక​ ఎంతో ఉద్వేగమవుతున్న ఎల్‌జీబీటీ కమ్యూనిటీ కలర్‌ఫుల్‌ సెలబ్రేషన్స్‌ నిమగ్నమైంది. వారి సెలబ్రేషన్స్‌లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకుంటున్నారు. ఈ తీర్పు ఢిల్లీలోని లలిత్‌ హోటల్‌కు కూడా కొంత ఉత్సాహాన్ని ఇచ్చింది. అక్కడి స్టాఫ్‌ డ్యాన్స్‌లతో అదరగొట్టారు. ఎందుకంటే, లలిత్‌ గ్రూప్‌ హోటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కేశవ్‌ సురి, ప్రముఖ ఎల్‌జీబీటీ కార్యకర్త. 

ఇంధ్రదనస్సు రంగుల్లో ఉన్న స్కార్ఫ్‌ను మెడలో, చేతికి ధరించి, హోటల్‌ స్టాఫ్‌ డ్యాన్స్‌తో హోరెత్తించారు. ఈ సెలబ్రేషన్స్‌లో ఇతరులను కూడా భాగస్వాములు కావాలని, హోటల్‌ స్టాఫ్‌ కోరారు. దీనిపై పనిచేసిన న్యాయవాదులందరికీ, జడ్జీలకు కృతజ్ఞతలని కేశవ్‌ సురి అన్నారు. పండుగ చేసుకోవడానికి ఇది చాలా పెద్ద సమయమని ఆనందం వ్యక్తం చేశారు. సెక్షన్‌ 377 కేసులో కేశవ్‌ సురి కూడా ఫిర్యాదుదారు.

స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించిన సుప్రీంకోర్టు, భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 377పై కీలక వ్యాఖ్యలు చేసింది. చరిత్ర వారికి క్షమాపణ చెప్పాలంటూ వ్యాఖ్యానించింది. వ్యక్తిగత  స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు. స్వలింగ సంపర్కులకు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని సమాన హక్కులు లభిస్తాయని  సుప్రీం కోర్టు తెలిపింది. తద్వారా  సెక్షన్‌ 377పై సుదీర్ఘ కాలంగా (సుమారు 157 ఏళ్లుగా) సాగుతున్న వివాదానికి  స్వస్తి పలికింది. అయితే జంతువులతో లైంగిక చర్యను, చిన్నారులతో అసహజ శృంగారాన్ని మాత్రం నేరంగానే పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది.   

మరిన్ని వార్తలు