-

కరోనా చికిత్సకు తాజా మార్గదర్శకాలు

5 Jun, 2020 08:42 IST|Sakshi

ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్‌ రోగులను ఆస్పత్రిలో చేర్చుకునేందుకు గంటల తరబడి వేచిచూసేలా చేయడం, కొందరు రోగులు వెనుతిరిగి వెళుతున్న వార్తల నేపథ్యంలో కరోనా వైరస్‌ రోగుల చికిత్సకు ఢిల్లీ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. తాజా నిబంధనల ప్రకారం కోవిడ్‌-19 రోగుల నుంచి ఎలాంటి వివరాలు సేకరించకుండా అంబులెన్స్‌ నుంచి నేరుగా చికిత్స అందచేసే ప్రాంతానికి తరలించే ప్రక్రియను 15 నిమిషాల్లో పూర్తిచేయాలి.

గంటలోపు రోగికి చికిత్స అందించేలా వైద్యుడు హాజరు కావడంతో పాటు వేచిఉండే ప్రాంతంలో సైతం ఆహారం, నీరు అందుబాటులో ఉంచాలి. ఆస్పత్రిలో బెడ్లు అందుబాటులో లేకుంటే మరోచోటకు తరలించే బాధ్యత సదరు ఆస్పత్రే వహించాలని తాజా నిబంధనల్లో ప్రభుత్వం పేర్కొంది. మరో ఆస్పత్రికి తరలించే లోగా రోగికి అవసరమైన చికిత్సను చేపట్టాలి. దేశ రాజధానిలో కరోనా వైరస్‌ కేసులు విపరీతంగా పెరుగుతుండటం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది.

చదవండి : తబ్లిగీ జమాత్‌ సభ్యులకు కేంద్రం షాక్‌!

మరిన్ని వార్తలు