జేఎన్‌యూ దాడిలో కొత్త విషయాలు

7 Jan, 2020 14:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని జేఎన్‌యూ హాస్టళ్లపై ఆదివారం రాత్రి ఓ పథకం ప్రకారమే దాడి జరిగిందనడానికి అనేక కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 200 మీటర్ల దూరంలో ఉన్న పెరియార్, సబర్మతి హాస్టళ్లపై దుండగులు దాడులు జరిపారు. సబర్మతి హాస్టల్‌లోనే ఎక్కువ గదులు ధ్వంసమయ్యాయి. అవన్నీ కూడా వామపక్ష, ముస్లిం విద్యార్థులవే అవడం గమనార్హం. సబర్మతి హాస్టల్‌లోనే జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలు ఐశే ఘోష్‌పై దాడి జరిగిందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ రీసర్చ్‌ స్కాలర్‌ తెలిపారు. కళ్లు కనిపించని ఓ సంస్కత స్కాలర్‌ గదిపై కూడా దాడి చేశారు. ఆ గది తలుపుపై బీఆర్‌ అంబేడ్కర్‌ పోస్టర్‌ ఉండడమే అందుకు కారణమని తెలుస్తోంది.

(చదవండి : ‘జేఎన్‌యూ దాడి మా పనే’)

‘బాబర్‌ కీ ఔలాద్‌’ అంటూ తనను చితక బాదినట్లు ఓ కశ్మీర్‌ విద్యార్థి ఆరోపించారు. ఏబీవీపీ పోస్టర్లు, గుర్తులున్న ఏ హాస్టల్‌ గదిపై దుండగులు దాడి చేయక పోవడం గమనార్హం. దుండగులు దాడి చేసినప్పుడు పలువురు విద్యార్థులు తమ సెల్‌ఫోన్ల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరు రాలేదని వారు చెబుతున్నారు. ఆ రోజు హాస్టళ్ల వద్ద సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటలవరకు విధులు నిర్వహించాల్సిన షిప్టులో ఒక్క గార్డు కూడా హాజరుకాక పోవడం ముందస్తు ప్రణాళికను సూచిస్తోంది. ఈ విషయమై మీడియా ముందు స్పందించేందుకు గార్డులు నిరాకరించారు. 
(చదవండి : భయంతో ఫస్ట్‌ ఫ్లోర్‌ నుంచి దూకేశారు...)

>
మరిన్ని వార్తలు