మాస్క్‌, సామాజిక దూరం, థర్మల్‌ స్క్రీనింగ్‌‌ తప్పనిసరి

27 May, 2020 09:02 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో నాలుగో దశ లాక్‌డౌన్ ముగిసిన తర్వాత కేంద్రం మెట్రో ప్రయాణాలకు అనుమతిస్తే... ప్రతి స్టేషన్‌లో రైలు ఆగే వ్యవధిని పెంచాలని ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(డీఎమ్‌ఆర్‌సీ) ఆలోచిస్తుంది. రైలులో సామాజిక దూరం అమలయ్యేలా చూడాలని భావిస్తుంది. లాక్‌డౌన్‌కు ముందు మెట్రో రైలు ప్రతి స్టేషన్‌లో 30 సెకన్ల పాటు ఆగేది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ఈ వ్యవధిని మరో 30 సెకన్ల పాటు పెంచాలని డీఎమ్‌ఆర్‌సీ చూస్తుంది. ఈ మేరకు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసిజర్‌(ఎస్‌ఓపీ)ని రూపొందించింది. మే 31 నాటికి దేశంలో నాల్గవ దశ లాక్‌డౌన్‌ ముగుస్తుంది. ఈ క్రమంలో కేంద్రం తీసుకునే నిర్ణయాల ఆధారంగా ఈ ఎస్‌ఓపీ ఆమోదం పొందనుంది.

ఇప్పటికే ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ డీఎమ్‌ఆర్‌సీ సీనియర్‌ అధికారులతో దీనిపై చర్చించారు. కేంద్రం మెట్రో రైళ్లకు అనుమతిస్తే.. సామాజిక దూరం పాటించడం, రైళ్లను శుభ్రపర్చడం వంటి అంశాల గురించి చర్చించారు. ఈ క్రమంలో డీఎమ్‌ఆర్‌సీ సీనియర్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘మెట్రోలో సామాజిక దూరం పాటించడం కోసం రెండు సీట్లకు మధ్య ఓ సీటు వదిలేయాలి. ప్రతి ట్రిప్‌ పూర్తి కాగానే రైళ్లను డిసిన్‌ఫెక్టెంట్‌ చేయాలి. స్టేషన్లో సామాజిక దూరం పాటించేలా మార్కింగ్‌ ఏర్పాటు చేయాలి. టోకెన్‌లతో పాటు కాంటాక్ట్‌లెస్‌ టికెటింగ్‌ను అమలు పర్చాలని భావిస్తున్నాం. ప్రయాణికులకు మాస్క్‌ తప్పనిసరి. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే... జరిమానాతో పాటు.. జైలు శిక్ష కూడా విధిస్తాం. స్టేషన్‌లోకి వచ్చేటప్పుడు ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరి. ఈ మేరకు అదనపు సిబ్బందని నియమించాలని భావిస్తున్నాం’ అని తెలిపారు. 

మరిన్ని వార్తలు