40 గంటల తర్వాత ఐదు పాజిటివ్‌ కేసులు

25 Mar, 2020 18:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మూడు రోజులుగా లాక్‌డౌన్‌లో ఉన్నదేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కొత్తగా ఐదు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. గత 40 గంటలుగా ఢిల్లీలో కరోనా రోగులు ఎవరూ లేరని సీఎం కేజ్రీవాల్‌ మంగళవారం సాయంత్రం ప్రకటించిన తర్వాత తాజా కేసులు నమోదవడం గమనార్హం. ఢిల్లీలో కరోనా వైరస్‌ బారిన పడిన 30 మంది రోగుల్లో కొందరు వారి ఆరోగ్యం కుదుటపడటంతో ఇంటికి వెళ్లారని, 23 మంది రోగులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని కేజ్రీవాల్‌ తెలిపారు.

ఢిల్లీలో వైరస్‌ కేసులు అధికం కావడం, గతంలో ఒకరు మరణించడంతో సీఎం కేజ్రీవాల్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ ఢిల్లీలో పూర్తి లాక్‌డౌన్‌ను ప్రకటించారు. గత మూడు రోజులుగా ఢిల్లీలో బస్సులు, క్యాబ్‌లు, రిక్షాలు సహా ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది. ఇక కరోనా మహమ్మారిని పారదోలేందుకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ తరహాలో 21 రోజులు లాక్‌డౌన్‌ను పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే.

చదవండి : ‘21 రోజుల్లో మహమ్మారిని తరిమికొడదాం’

మరిన్ని వార్తలు