సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం సృష్టించే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి అదే తరహా మాటల తూటాలు పేల్చారు. ‘భారతదేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు కావడం వల్ల.. ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంది’ అని అన్నారు. దేశంలో మెజారిటీ వర్గం సంఖ్య తగ్గితే.. సామాజిక అభివృద్ధి ప్రమాదంలో పడుతుందని ఆయన చెప్పారు. మెజారిటీ ప్రజల సంఖ్య తగ్గితే.. జాతీయతావాదం కూడా మరుగున పడే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత సురక్షితంగా ఉందని, హిందువులు ఇంకా ఇక్కడ మెజారిటీ జనాభాగా ఉండడమే ఇందుకు కారణం అని గిరిరాజ్ స్పష్టం చేశారు. దేశంలో ఎప్పుడైతే మెజారిటీ ప్రజల సంఖ్య తగ్గుముఖం పడుతుందో అప్పుడు ప్రజాస్వామ్యం, అభివృద్ధి, సామాజిక సామరస్యం ప్రమాదంలో పడతాయని ఆయన హెచ్చరించారు.
దేశంలో సుమారు 54 జిల్లాల్లో ముస్లింల జనాభా విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్, అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో ఇదీ మరీ ఎక్కువగా ఉంది. ముస్లింలు మెజారిటీ వర్గంగా అవతరిస్తే దేశసమగ్రత, ఐకమత్యానికి భంగం కలిగే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.