ఎగవేతదారుల లిస్ట్‌లో సీఎంతో సహా 18 మంది మంత్రులు

24 Jun, 2019 16:47 IST|Sakshi

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఏకంగా ఏడున్నర లక్షల రూపాయల వాటర్‌ బిల్లు ఎగ్గొట్టారంట. ఈ విషయాన్ని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) వెల్లడించింది. ముఖ్యమంత్రితో పాటు మరో 18 మంది మంత్రులను ఎగవేతదారులుగా ప్రకటించింది. షకీల్‌ అహ్మద్‌ అనే సామాజక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా చేసిన దరఖాస్తుకు బీఎంసీ ఈ మేరకు సమాధానమిచ్చింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ అధిరారిక నివాసం ‘వర్షా’ బంగ్లాకు ఏడు కనెక్షన్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ బిల్డింగ్‌ పేరు మీద దాదాపు 7,44,891 రూపాయల వాటర్‌ బిల్లు బకాయి పడ్డట్లు ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది.

ముఖ్యమంత్రితో పాటు మంత్రులు సుధీర్‌ ముంగతివార్‌, పంకజా ముండే, రామ్‌దాస్‌ కదమ్‌ సహా 18 మంది మంత్రుల పేర్లను కూడా ఎగవేతదారుల జాబితాలో చేర్చినట్లు బీఎంసీ తెలిపింది. అయితే బిల్లు కట్టని సీఎం, మంత్రులపై బీఎంసీ ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోనట్లు తెలుస్తోంది. ముంబైలో వీవీఐపీల పెండింగ్‌ నల్లా బిల్లు ఏకంగా రూ. 8కోట్ల పైనే ఉందట.

మరిన్ని వార్తలు