విడిగా పోటీ.. సీఎం హీరో అయ్యారు!

24 Feb, 2017 15:55 IST|Sakshi
విడిగా పోటీ.. సీఎం హీరో అయ్యారు!

ముంబై: మహారాష్ట్రలో జరిగిన 10 మునిసిపల్‌ కార్పొరేషన్లు, 25 జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో అధికార బీజేపీ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించడంతో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిష్ట మరో స్థాయికి చేరింది. ఈ స్థానిక ఎన్నికల ఫలితాలతో బీజేపీలో ఫడ్నవీస్ మార్క్ రాజకీయంతో హీరో అయ్యారు. కీలకమైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) లో బీజేపీ తన స్థానాలను ఘననీయంగా పెంచుకోవడంతో పాటు శివసేనకు కంచుకోటగా ఉన్న కార్పొరేషన్లో వారి జోరుకు బ్రేకులు వేయగలిగింది.

బీఎంసీలో మొత్తం 227 స్థానాలకుగానూ శివసేన 84 సీట్లు, బీజేపీ 82 స్థానాలు నెగ్గాయి. కాంగ్రెస్ 31, ఎన్సీపీ 9 సీట్లు, ఎంఎన్ఎస్ 7, మజ్లిస్ పార్టీ 3 స్థానాలు దక్కించుకోగా, ఇండిపెండెంట్లు 11 స్థానాలు దక్కించుకున్నారు. గతంలో 31 స్థానాలున్న బీజేపీ ఈసారి శివసేనతో పొత్తులేకుండా విడిగా బరిలో నిలిచి మరో 51 స్థానాలు అదనంగా సాధించుకుంది. రాష్ట్రంలో ఎలాంటి వివాదాలలో చిక్కుకోకుండా క్లీన్ ఇమేజ్ తో ఉన్న ఫడ్నవీస్ ముందుండి పార్టీని నడిపించడంతో బీజేపీ అధిష్టానంతో మంచి మార్కులు కొట్టేశారు. కార్పొనేషన్ ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టి రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు తీసుకురావాలని భావించిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు ఈ ఫలితాలు మింగుడు పడటం లేదు. బీజేపీ నోటిస్ పిరియడ్ లో ఉందని, శివసేన మద్ధతు లేకపోతే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉండదని వ్యాఖ్యానించిన ఉద్ధవ్ ఈ ఫలితాలతో కాస్త వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది.

తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ కూలిపోదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తానే సీఎం పీఠంలో కొనసాగుతానని చెప్పిన ఫడ్నవీస్  ధైర్యంగా శివసేన ఎత్తులకు పై ఎత్తులు వేసి బీజేపీకి విజయాన్ని చేకూర్చారు. బీఎంసీ సహా 8 కార్పొరేషన్లలో కమలం పార్టీ సత్తా చాటింది. బీఎంసీలో శివసేన, బీజేపీలకు మ్యాజిక్ ఫిజిక్ 114 స్థానాలు రాలేదు. అయితే వలసలపై ఆ పార్టీలు దృష్టిపెడతాయా లేక కూటమిగా కొనసాగుతాయా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఎంసీ ఎన్నికల్లో విఖ్ రోలీ కార్పొరేటర్ స్నెహల్ మోరె, దిండోషి నుంచి గెలిచిన తలసీదాస్ షిండేలు శివసేనలో చేరిపోయారు.

మరిన్ని వార్తలు