‘సీఎం పీఠంపై వివాదం లేదు’

15 Oct, 2019 12:01 IST|Sakshi

ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ-శివసేన కూటమి అధికారంలోకి వస్తే తదుపరి ప్రభుత్వానికి శివసేన నేతే సారథ్యం వహిస్తారని శివసేన ప్రకటించిన క్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ స్పందించారు. మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనే దానిపై ఎలాంటి వివాదం లేదని ఫడ్నవీస్‌ స్పష్టం చేశారు. సీఎం పదవి కోసం భాగస్వామ్య పక్షం శివసేన ఆకాంక్షలపై ఆయన వ్యాఖ్యానిస్తూ దీనిపై తాను కలత చెందడం లేదని, ప్రస్తుతం ఈ అంశంపై కూటమిలో ఎలాంటి వివాదం లేదని అన్నారు. కాగా మహారాష్ట్ర సీఎంగా శివసేన నేత పాలనా పగ్గాలు చేపడతారని సేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే సహా ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే సైతం పదేపదే పేర్కొనడం​ గమనార్హం. మరోవైపు సీఎం రేసులో ఆదిత్య ఠాక్రే ఉంటారనే ప్రచారం సాగుతోంది. ఇక అక్టోబర్‌ 21న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 24న వెల్లడికానున్నాయి.

మరిన్ని వార్తలు