‘ధనుష్‌’ ప్రయోగం సక్సెస్‌

24 Feb, 2018 02:03 IST|Sakshi

బాలాసోర్‌(ఒడిశా): అణ్వాయుధాలను మోసుకుపోగల సామర్థ్యం కలిగిన బాలిస్టిక్‌ క్షిపణి ధనుష్‌ పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని భారత నావికా దళానికి చెందిన ఓ నౌక ద్వారా ధనుష్‌ను పరీక్షించారు. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇది విజయవంతంగా ఛేదించినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. భూ ఉపరితలం నుంచి భూ ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించగల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వీ క్షిపణిని నావికా దళ అవసరాల కోసం అభివృద్ధి పరిచి ధనుష్‌ క్షిపణిగా రూపొందించారు. ఈ క్షిపణిని శుక్రవారం ఉదయం బంగాళాఖాతంలో పారాదీప్‌ దగ్గర్లోని ఓ నౌక ద్వారా విజయవంతంగా ప్రయోగించినట్టు అధికారులు చెప్పారు. ధనుష్‌ క్షిపణి 500 కిలోల పేలుడు పదార్థాలను మోసుకుపోగలదు. భూ, సముద్ర తలంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ధనుష్‌ ఇప్పటికే భారత రక్షణ బలగాల్లో చేరింది.

మరిన్ని వార్తలు