మసూద్‌పై నిషేధం.. అయినా ఏం లాభం : డిగ్గీరాజా

2 May, 2019 11:16 IST|Sakshi

భోపాల్‌ : పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజహర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన సంగతి తెలిసిందే.  విషయంలో ఎన్నో ఏళ్లుగా మోకాలడ్డుతున్న చైనా.. అగ్రదేశాల ఒత్తిడులకు ఎట్టకేలకు తలొగ్గక తప్పలేదు. దీంతో భారత్‌కు భారీ దౌత్య విజయం లభించింది. ఫలితంగా, అజార్‌ ఆస్తులను స్తంభింపజేసేందుకు, అతడి ప్రయాణంపై నిషేధం విధించేందుకు, ఆయుధాలు సమకూర్చుకునే వీలు లేకుండా చేసేందుకు ఐరాసకు సత్వరం వీలు కలిగింది. ఈ విషయంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భోపాల్‌ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్‌ సింగ్‌ స్పందించారు. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్నేహితుడిగా ఉన్నంతకాలం ఐరాస నిషేధం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయని ఆయన ప్రశ్నించారు.

చదవండి : అజహర్‌ అంతర్జాతీయ ఉగ్రవాదే

భోపాల్‌లో ఓ కార్యక్రమంలో డిగ్గీరాజా మాట్లాడుతూ... ‘ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ మోదీజీతో స్నేహం కోసం పాకులాడుతున్నారు. ఇలాంటి సమయంలో మసూద్‌ అజహర్‌పై ఐక్యరాజ్యసమితి నిషేధం విధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది.  దావూద్‌ ఇబ్రహీం, మసూద్‌ అజహర్‌, హఫీజ్‌ సయీద్‌ వంటి ఉగ్రవాదులను వెంటనే భారత్‌కు అప్పగించాలని భారత్‌ డిమాండ్‌ చేయాలి. అదొక్కటే సరైన మార్గం అని వ్యాఖ్యానించారు. ఇక మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించటాన్ని కాంగ్రెస్‌ పార్టీ స్వాగతించింది. యూపీఏ హయాంలో లష్కర్‌ ఏ తొయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ తలపై రివార్డు ప్రకటించినట్లుగా.. అజహర్‌ తలపై కూడా భారీ రివార్డు ప్రకటించాలని డిమాండ్‌ చేసింది. కాగా కశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా దళం కాన్వాయ్‌పై జైషే ఉగ్రవాది చేసిన దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత వైమానిక దళం పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేయడం, ఈ క్రమంలో భారత పైలట్‌ పాక్‌ ఆర్మీకి చిక్కడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఉగ్రదాడులకు కారణమైన మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ అగ్ర దేశాలను కోరిన భారత్‌.. చివరకు బుధవారం దౌత్యపరంగా పెద్ద విజయం సాధించింది.

మరిన్ని వార్తలు