భత్కల్ను తప్పించేందుకు ఐఎస్ఐఎస్ కుట్ర

4 Jul, 2015 09:26 IST|Sakshi
భత్కల్ను తప్పించేందుకు ఐఎస్ఐఎస్ కుట్ర

హైదరాబాద్ :రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ను జైలు నుంచి తప్పించేందుకు ఐఎస్ఐఎస్ పథకం వేసింది. అయితే ఈ విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టాయి. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న భత్కల్ తన భార్య జహిదాతో ఫోన్లో  మాట్లాడినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. తనను త్వరలో ఐఎస్ఐఎస్ జైలు నుంచి తప్పిస్తుందని అతడు..ఢిల్లీలో ఉంటున్న భార్యకు ఫోన్లో చెప్పినట్లు సమాచారం.

డమాస్కస్‌లోని స్నేహితులు.. తనను త్వరలో జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారని, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత డమాస్కస్‌ వెళ్లిపోదామని భత్కల్ తన భార్యతో చెప్పినట్లు తెలుస్తోంది. భత్కల్‌ చెప్తున్న డమాస్కస్‌లోని స్నేహితులు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా కేంద్ర నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

అంతేకాక చర్లపల్లి జైలు నుంచి భత్కల్‌ తన భార్యకు 10 ఫోన్‌కాల్స్‌ చేశాడని... భార్యతోపాటు ఇంకొంతమందితోనూ అతడు ఫోన్‌లో మాట్లాడాడని ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి‌. యాసిన్‌ భత్కల్‌ ఫోన్‌కాల్స్‌ను రికార్డ్‌ చేసిన కేంద్ర నిఘా వర్గాలు... అతని వెనకున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు భత్కల్కు సెల్ ఫోన్ ఎలా అందుబాటులోకి వచ్చిందనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు.

 

మరిన్ని వార్తలు