రేప్ కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

1 Jul, 2015 11:31 IST|Sakshi
రేప్ కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లోసుప్రీంకోర్టు బుధవారం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అత్యాచార బాధితులకు, నిందితులకు మధ్య  రాజీ కుదర్చడానికి  ప్రయత్నించడాన్ని ఉన్నత ధర్మాసనం తీవ్రంగా ఖండించింది.  రేప్ కేసులలో బాధితురాలితో నిందితుల ఒప్పందాలు చెల్లవని స్పష్టం చేసింది. ఈ చర్య మహిళల గౌరవానికి  వ్యతిరేకమైనదని వ్యాఖ్యానించింది.  

ఇటీవల తమిళనాడు కోర్టు అత్యాచార కేసులో మధ్యవర్తిత్వానికి  ఆదేశించడాన్ని తప్పుబట్టిన  సుప్రీంకోర్టు పైవిధంగా స్పందించింది. దోషులకు కఠినమైన శిక్షలు అమలు చేయాలని, నిందితులు, బాధితులు రాజీ చేసుకున్నా దాన్ని తీవ్ర నేరంగా పరిగణించాలని ఆదేశించింది.  లైంగిక దాడి చేసిన వ్యక్తులతో రాజీ కుదుర్చుకోమని కోరడమంటే నేరస్తుల పట్ల మెతకవైఖరి చూపించినట్లు అవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాజీ చేయడమంటే మహిళా హక్కులను కాలరాయడమేనని పేర్కొంది.  ఇది  చాలా తీవ్రమైన తప్పిదమని పేర్కొంది.

కాగా ఇటీవల మద్రాస్ హైకోర్టు  ఒక రేప్ కేసులో జైల్లో ఉన్న నిందితుడుకి ..బాధితురాలితో మాట్లాడి రాజీ చేసుకోవడానికి వీలుగా బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా సదరు వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాల్సిందిగా బాధిత మహిళకు జడ్జి సూచించడం వివాదాన్ని రాజేసింది.
 

మరిన్ని వార్తలు