వీజీ సిద్ధార్థ కుమారుడితో డీకే ఐశ్వర్య వివాహం!

4 Jun, 2020 17:27 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ కుమార్తె ఐశ్వర్యను  కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేకు ఇచ్చే వివాహం జరిపించాలని వారి కుటుంబ పెద్దలు నిర్ణయించారు. శివకుమార్‌ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య (22) బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసి తన తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నారు. ఇక అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసించిన అమర్త్య సైతం వ్యాపారంలో కొనసాగుతున్నారు. కాగా వీరిద్దరి పెళ్లిపై చర్చించేందుకు గత ఆదివారం సిద్ధార్థ ఇంటికి డీకేశి కుటుంబ సభ్యులు వెళ్లినట్టు అయన సన్నిహితుల ద్వారా తెలిసింది. (‘కాఫీ కింగ్‌’ విషాదాంతం)

ఇక ఐశ్యర్య-అమర్త్య వివాహంపై శివకుమార్‌ మాట్లాడుతూ.. సిద్ధార్థ ఉన్నప్పుడు వీరి వివాహానికి సంబంధించి ఓ సారి ప్రస్తావన వచ్చిందని చెప్పారు. జూలై 31 నాటికి ఆయన మృతి చెందిన ఏడాది పూర్తి అవుతుందని.. ఆ తరువాత పెళ్లి తేదీల నిర్ణయంపై స్పష్టత వస్తుందని తెలిపారు. సిద్ధార్థకు శివకుమార్‌ మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉన్నట్లు వారి సన్నిహితుల ద్వారా తెలిసింది. కాగా కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ 2019 జులైలో అదృశ్యమయ్యారు. తర్వాత కొద్ది రోజులకు నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఆర్థికసమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. ఆ తరువాత ఆయన వ్యాపారాలను సిద్ధార్థ బార్య మళవికా చూసుకుంటున్నారు. (ఐశ్వర్యను 7 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ)

మరిన్ని వార్తలు