అన్నాకు ఘన నివాళి

4 Feb, 2019 09:30 IST|Sakshi

సీఎం, డిప్యూటీల  పుష్పాంజలి

 డీఎంకే శాంతి ర్యాలీ

సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై 50వ వర్ధంతిని ఆదివారం వాడవాడలా ద్రవిడ పార్టీలు ఘనంగా జరుపుకున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకే, ఎండీఎంకే, ద్రవిడ కళగంల నేతలు మెరీనా తీరంలోని అన్నా సమాధి వద్దకు తరలివచ్చి పుష్పాంజలి ఘటించారు. డీఎంకే నేతృత్వంలో శాంతి ర్యాలీలు నిర్వహించారు. అన్నా చిత్ర పటానికి సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం నివాళులర్పించారు. అన్నాడీఎంకే నేతృత్వంలో ఆలయాల్లో సహఫంక్తి భోజనాలు ఏర్పాటుచేశారు.

అన్నాడీఎంకే నేతృత్వంలో..
అన్నాడీఎంకే నేతృత్వంలో రాష్ట్రంలో అన్నా వర్ధంతిని పురస్కరించుకుని వాడవాడల్లో కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే,  సహఫంక్తి భోజనాలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం తమ నివాసాల వద్ద అన్నా చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదనన్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో కలసి మెరీనా తీరంలోని అన్నా సమాధి వద్దకు చేరుకుని ఘన నివాళులర్పించారు. అన్నా ప్రసంగాలు, ఆయన సేవల్ని నెమరువేసుకున్నారు. కేపీ మునుస్వామి, వైద్యలింగం వంటి నేతలు, మంత్రి జయకుమార్‌లతో పాటుపార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పలువురు తరలి వచ్చి అన్నాకు నివాళులర్పించారు. తదుపరి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అన్నాడీఎంకే వర్గాలు పలుచోట్ల ఉన్న ఆలయాలకు చేరుకుని,  ప్రజలతో కలసి సహఫంక్తి భోజనాలు చేశారు.

కేకే నగర్‌లోని శక్తి వినాయక ఆలయంలో సీఎం పళనిస్వామి పూజలుచేశారు. అక్కడ ప్రజలతో కలిసి సహçపంక్తి భోజనం చేశారు. తిరువాన్మియూరులోని మరుందీశ్వర ఆలయంలో డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం పూజలు చేశారు. సహపంక్తి భోజన కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రులు దాదాపుగా 30 మంది చెన్నైలోని వివిధ ఆలయాల్లో పూజల అనంతరం ప్రజలతో కలిసి సంహపంక్తి భోజనాలు చేశారు. 

మరిన్ని వార్తలు