-

ప్రేమించలేదని పొడిచి చంపాడు...

23 Apr, 2014 04:31 IST|Sakshi

చెన్నైలో సహోద్యోగినిని హత మార్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
తానూ పొడుచుకుని ఆత్మహత్యాయత్నం

 
 చెన్నై: ప్రేమించడానికి నిరాకరించిన పాపానికి మరో నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. చెన్నైలో సోమవారం అర్ధరాత్రి.. తన ప్రేమను నిరాకరించిందంటూ తోటి ఉద్యోగినిని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పొడిచి చంపాడు. తర్వాత తానూ పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. మంగళవారం పోలీసులు వెల్లడించిన వివరాలు.. వేంకటాచలపతి (29), వైశ్య (25) నగరంలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగులు.సోమవారం రాత్రి విధులు ముగించుకుని వైశ్య పెరుంగుడి రైల్వే స్టేషన్ వద్ద నడుచుకుంటూ వస్తుండగా ఆమెతో వేంకటాచలపతి ఘర్షణ పడ్డాడు. వాగ్వాదం పెరగడంతో కోపోద్రిక్తుడైన వేంకటాచలపతి ఆమెను కత్తితో పొడిచాడు. తర్వాత తానూ పొడుచుకున్నాడు. తీవ్రంగా గాయపడిన వైశ్యను ఆస్పత్రికి తరలిం చగా అప్పటికే మృతిచెందింది.

వేంకటాచలపతి రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ సంఘటన నేపథ్యంలో రాత్రి పూట ఐటీ ఉద్యోగినులు సురక్షితంగా ఇంటికి చేరే విషయంపై మరోసారి ఆందోళనలు పెరిగాయి. గత ఫిబ్రవరిలో టీసీఎస్ ఉద్యోగి అయిన 24 ఏళ్ల మహిళను నగర శివార్లలోని కార్యాలయం సమీపంనుంచి అప హరించిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై దారుణానికి పాల్పడి హతమార్చారు. ఈ నేపథ్యంలో రాత్రి 8:30 దాటితే ఉద్యోగినులను టూ వీలర్లపై అనుమతించరాదని, కంపెనీల పరిసరాల్లో కెమెరాలతో భద్రత కట్టుదిట్టం చేయాలని కూడా పోలీసులు ఆదేశాలు జారీచేశారు.
 
 

మరిన్ని వార్తలు