కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: భారత్లాంటి పెద్ద దేశంలో జరిగే ఒకటీ రెండు అత్యాచార ఘటనలపై అతిగా స్పందించవద్దనీ కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ వ్యాఖ్యానించారు. కఠువా, ఉన్నావ్ ఘటనలతో దేశంలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
బరేలీలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..‘ఇలాంటివి జరగటం దురదృష్టకరం.. కొన్ని సార్లు వీటిని ఆపడం సాధ్యం కాదు.. భారత్ లాంటి పెద్దదేశాల్లో ఇలాంటి ఘటనలు ఒకటీ రెండు జరిగినప్పుడు వాటిపై రాద్ధాంతం చేయటం తగదు. ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరమైన మేరకు చర్యలు తీసుకుంటోంది..’అని వ్యాఖ్యానించారు. బీజేపీకి చెందిన బరేలీ ఎంపీ సంతోష్ గంగ్వార్ కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయమంత్రిగా ఉన్నారు.