కొత్త నోట్ల ముద్రణకు ఎంత ఖర్చవుతుందో తెలుసా?

21 Dec, 2016 11:59 IST|Sakshi
కొత్త నోట్ల ముద్రణకు ఎంత ఖర్చవుతుందో తెలుసా?
కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత కొత్తగా 2000, మళ్లీ 500 రూపాయల నోట్లు ముద్రిస్తోంది. అయితే.. వీటి ముద్రణకు ఎంత ఖర్చవుతుందో అనే విషయం కూడా ఆసక్తికరమే. కొత్త 500 నోటు ముద్రించాలంటే రూ. 3.09, 2వేల రూపాయల నోటు ముద్రించాలంటే రూ. 3.54 చొప్పున ఖర్చవుతుందట. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంకు తరఫున నోట్లు ముద్రించే భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్‌బీఎన్ఎంపీఎల్) సంస్థ తెలిపింది. ఇది రిజర్వు బ్యాంకు అనుబంధ సంస్థ. ఈ సంస్థను ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ వివరాలు అడిగారు. దానికి సమాధానంగానే పై వివరాలను వెల్లడించింది. 500 రూపాయల నోట్లు వెయ్యి ముద్రించాలంటే మొత్తం రూ. 3090 ఖర్చవుతుందని, అదే రెండువేల నోట్లకైతే వెయ్యి నోట్లకు తాము రూ. 3540 వసూలు చేస్తామని బీఆర్‌బీఎన్ఎంపీఎల్ చెప్పింది. 
 
మహాత్మా గాంధీ సిరీస్‌లో కొత్త 500 రూపాయల నోట్ల బ్యాచ్‌ని రెండు నంబర్ ప్యానళ్లలోను 'ఆర్' అనే అక్షరంతో విడుదల చేస్తున్నట్లు రిజర్వు బ్యాంకు సోమవారం ప్రకటించింది. త్వరలోనే కొత్త 50 రూపాయల నోట్లను కూడా విడుదల చేస్తామని, అయితే అంతమాత్రాన పాత 50 రూపాయల నోట్లను మాత్రం రద్దు చేసేది లేదని కూడా రిజర్వు బ్యాంకు చెప్పిన విషయం తెలిసిందే. 
మరిన్ని వార్తలు