కడుపు నొప్పి అని వెళితే.. కండోమ్స్‌ తెమ్మన్నాడు

28 Jul, 2019 17:19 IST|Sakshi

రాంచీ : కడుపునొప్పితో బాధపడుతున్న ఓ మహిళ ఆస్పత్రికి వెళితే.. ప్రిస్కిప్షన్‌లో కండోమ్స్‌ రాసిచ్చాడో కీచక డాక్టర్‌. అది తెలియక మెడికల్‌ దుకాణానికి వెళ్లిన మహిళ.. మందుల చీటీ చూపించి మందులు అడగ్గా కండోమ్స్‌ ప్యాకెట్‌ను చేతిలో పెట్టారు. ఇది చూసి కంగుతిన్న మహిళ సదరు డాక్టర్‌పై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూం జిల్లాలో  చోటు చేసుకుంది. వివరాలు.. జిల్లాకు చెందిన నాలుగో తరగతి మహిళా ఉద్యోగికి ఈనెల 23న కడుపు నొప్పి రావడంతో ఘాట్‌షీలా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షలు నిర్వహించిన కాంట్రాక్ట్‌ డాక్టర్‌ అస్రప్‌ మందులు తెచ్చుకోమని ప్రిస్కిప్షన్‌ రాసిచ్చారు. డాక్టర్‌ రాసిచ్చిన మందుల చీటీని తీసుకున్న సదరు మహిళ.. సమీపంలో ఉన్న మెడికల్‌ దుకాణానికి వెళ్లి మందులు ఇవ్వమని అడిగారు.

ప్రిస్కిప్షన్‌ చూసిన సిబ్బంది ఆమెకు కండోమ్స్‌ ప్యాకెట్‌ను అందజేశారు. ఇదేంటి మందులు అడిగితే ఈ ప్యాకెట్‌ ఇచ్చారని సదరు మహిళ సీరియస్‌ అవ్వగా.. మందుల చీటీలో అదే రాసి ఉందని మెడికల్‌ సిబ్బంది చెప్పింది. దీంతో షాక్‌కు గురైన మహిళ.. జార్ఖండ్‌ ముక్తి మోర్చా శాసన సభ్యులు కునాల్‌ సారంగికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కునాల్ సారంగి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని సీనియర్‌ డాక్టర్ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సీనియర్‌ డాక్టర్లు విచారణ ప్రారంభించారు. మెడికల్‌ విభాగ సిబ్బంది, ఓ మానసిన వైద్యుడుతో కూడిన కమిటీ ఈ ఘటనపై విచారణ జరుపుతోందని ఆస్పత్రి ఇన్‌చార్జ్‌ శంకర్‌ పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై డాక్టర్‌ అస్రఫ్‌ ఇంతవరకూ స్పందిచకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు