తిరువొత్తియూరు: కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన ఓ డాక్టర్.. డెంగీ జ్వరంతో ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ మృతి చెందారు. విషయం తెలిసి అతని తల్లి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన కోవై జిల్లా కుట్టుపాళయం సమీపం, సిరుముగై రాంనగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈరోడ్ జిల్లా తాళవాడి సమీపంలోని తెంగుమరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జయమోహన్ (29) వైద్యుడిగా పని చేస్తున్నాడు. కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీన జయమోహన్ డిశ్చార్జ్ అయ్యాడు. కాగా మళ్లీ ఆరోగ్యం బాగలేకపోవడంతో కుటుంబ సభ్యులు మేట్టుపాళయంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. (బగ్గా వైన్ షాప్ పేరుతో ఆన్లైన్లో మోసం)
అక్కడి డాక్టర్లు కోవైలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి పంపించారు. తీవ్ర జ్వరం ఉన్న అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలింది. మరోసారి అతనికి పరీక్షలు చేయించగా డెంగీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మంగళవారం రాత్రి పరిస్థితి విషమించడంతో అతడు మృతి చెందాడు. కన్నకొడుకు మరణించాడన్న విషయం తెలిసి అతని తల్లి జ్యోతి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా ఆమెను ఇరుగుపొరుగు వారు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. (భార్యతో సైకిల్పై 120 కిలోమీటర్లు..)