గువాహటి: ప్రస్తుతం ప్రాణాంతక కరోనా వైరస్ సోకుతుందనే భయం ప్రతీ ఒక్కరినీ వెంటాడుతోంది. ముఖ్యంగా కరోనా పేషెంట్లకు సేవలు అందించే వైద్యులు, నర్సుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నా.. అంటువ్యాధి సోకుంతదనే అనుమానం వారి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో మహమ్మారి అంటుకోకుండా ఉండేందుకు చాలా మంది వైద్యులు హైడ్రాక్సీక్లోరోకైన్ ఉపయోగిస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. మలేరియాను నిరోధించడానికి ఉపయోగించే ఈ ఔషధం కోవిడ్ ప్రభావాన్ని తగ్గిస్తుందనే ఉద్దేశంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ టాస్క్ ఫోర్స్ దీని వాడకానికి అనుమతినిచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో అసోంలో హైడ్రాక్సీక్లోరోకైన్ తీసుకున్న ఓ డాక్టర్ మృతి చెందడం కలకలం రేపుతోంది.(‘నేను చనిపోతే నా పిల్లలు ఇది తెలుసుకోవాలి’)
వివరాలు.. ఉత్పలజిత్ బర్మన్ అనే వ్యక్తి వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం గుండె సంబంధిత వ్యాధితో ఆయన వేరొకరి ఆస్పత్రిలో చేరారు. ఇక కరోనా వ్యాపిస్తున్న తరుణంలో ముందు జాగ్రత్తగా చర్యగా ఆయన హైడ్రాక్సిక్లోరోకైన్ తీసుకున్నట్లు సన్నిహితులు తెలిపారు. అయితే ఆయన మృతి చెందడానికి కేవలం ఇదొక్కటే కారణమా లేదా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. కాగా దేశ వ్యాప్తంగా దాదాపు 1071 కరోనా కేసులు నమోదు కాగా.. అసోంలో ఇంత వరకు ఒక్కరు కూడా కరోనా బారిన పడలేదు. అయితే అక్కడ కేవలం ప్రభుత్వ ఆస్పత్రులు, ల్యాబ్లలో మాత్రమే కరోనా టెస్టులకు అనుమతి ఉండటంతో సందేహాలు తలెత్తుతున్నాయి.(ట్రక్కు కింద పడ్డట్టు... కొండపై నుంచి తోసేసినట్టు)