కరోనాతో డాక్టర్ల సమస్యలు..

17 Jul, 2020 19:43 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి అన్ని దేశాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనాతో బాధపడే ప్రజలకు వైద్యం అందిస్తూ డాక్టర్లు చేస్తున్న కృషి మరువలేనిది. కనిపించే దైవంగా భావించే డాక్టర్లను కరోనా కబలిస్తుంది. దేశంలో ఇప్పటి వరకు 100 మంది డాక్టర్లు మరణించారు. జనాభాకు సరిపడా వైద్య సిబ్బంది లేనందున ప్రస్తుతం ఉన్న డాక్టర్లే అధిక గంటలు సేవలందిస్తున్నారు. 40 డిగ్రీల వేడిలో పీపీఈ కిట్లతో కరోనా రోగులకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. ఇంత వేడిలో పీపీఈ కిట్లను ధరించడం చాలా ఇబ్బందిగా ఉంటుందని, కానీ తమ ప్రాణాలు, రోగుల ప్రాణాలను కాపాడానికి వేరే మార్గం లేదని ఢిల్లీలోని శారదా ఆస్పత్రికి చెందిన ఓ డాక్టర్‌ తెలిపారు.

దేశంలోని ఆరోగ్య రంగానికి ప్రభుత్వం చాలా తక్కువ బడ్జెట్‌ ఖర్చు పెడుతుందని, వైద్య సిబ్బందికి తక్కువ జీతాలు చెల్లిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డాక్టర్లు అధిక సమయం ఆస్పత్రులలో పనిచేస్తుండడం వల్ల తలనొప్పి, వాంతులు తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారు.  కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో సరియైన సదుపాయాలు లేక వైద్య సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆరోగ్య సమస్యలు, తక్కువ వేతనాల అసంతృప్తితో చాలా మంది డాక్టర్లు దీర్ఘకాలిక సెలవులు పెడుతున్నారు.

మరిన్ని వార్తలు