యాప్స్​ బ్యాన్​: డేటా చోరి ఆగుతుందా?

8 Jul, 2020 19:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ) వద్ద చెలరేగిన అలజడి, భారతీయ యూజర్ల ప్రైవసీ, భద్రతను దృష్టిలో పెట్టుకుని భారత్​, చైనాకు చెందిన 59 యాప్స్​పై నిషేధం విధించింది. ఈ యాప్స్​ను తయారుచేసిన డెవలపర్స్​కు అందరికీ చైనా ప్రభుత్వంతో సంబంధాలున్నాయి. కానీ, ఇక్కడితో చైనా ముప్పు తొలగిపోలేదు. అనుమానిత లిస్టులో లేని వాటి నుంచి భద్రతాపరమైన ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ‘బ్లోట్​వేర్​’ప్రథమ స్థానంలో నిలుస్తుంది.(వెనుదిరిగేందుకు ఇంకొంతకాలం)

బ్లోట్​వేర్
కొన్ని మొబైల్​ ఫోన్లలో ముందుగానే ఇన్​స్టాల్​ చేసి ఇచ్చే యాప్స్​ సిస్టంను బ్లోట్​వేర్​ అంటారు. వీటిని తీసేయడం కానీ, అన్​ఇన్​స్టాల్​ కానీ, డిజేబుల్ కానీ​ చేయలేం. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. ఈ యాప్స్​ను రెవెన్యూ కోసం మొబైల్​ తయారుచేసే సంస్థలు ఇన్​స్టాల్​ చేస్తాయి.
కొన్ని కంపెనీలు తక్కువ ధరకే ఫోన్లు అమ్ముతూ, థర్డ్​ పార్టీ యాప్స్​ను వాటిలో ఇన్​స్టాల్​ చేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. చాలా చైనా కంపెనీలు మొబైల్స్​ ఇలానే చేస్తున్నాయి.

షావోమి ఇందుకు ఓ చక్కని ఉదాహరణ. 2018లో ఈ కంపెనీ తన ఆదాయంలో 9.1 శాతాన్ని మొబైల్స్​లో ప్రీ ఇన్​స్టాల్​ చేసిన యాప్స్, సర్వీసుల​ ద్వారా రాబట్టింది. శాంసంగ్​ తదితర కంపెనీలు కూడా ఇలాంటి బిజినెస్​ మోడల్​ను అనుసరించాయి. అయితే, తక్కువ ధర కలిగిన మొబైల్స్​లో మాత్రమే ప్రీ ఇన్​స్టాల్డ్​ యాప్స్​ను ఉంచుతున్నాయి.

కొంపముంచుతున్న తక్కువ ధర!
అతి తక్కువ ధరకే ఫోన్లు వస్తున్నాయని కొనేస్తున్న వినియోగదారులు మరో రూపంలో మూల్యం చెల్లించుకుంటున్నారు. ప్రీ ఇన్​స్టాల్డ్​ యాప్స్ ఫోన్​లోని స్పేస్​ను, బ్యాటరీని తినేయడం ఒక ఎత్తైతే, సెక్యూరిటీ పరంగా ఈ యాప్స్ చాలా డేంజర్. ఇవి నిరంతరం యూజర్​ డేటాను ఊహించని రీతిలో కలెక్ట్​ చేస్తున్నాయి. ఫలితంగా వినియోగదారుడి సమాచారాన్ని మిస్​ యూజ్​ చేసేందుకు ఆస్కారం ఏర్పడుతోంది.(వాణజ్య శాఖతో పీఎంఓ సంప్రదింపులు)

ఈ సమస్యపై పాలసీల్లోగానీ, అకడమిక్​ సర్కిల్స్​లో గానీ పెద్దగా పట్టింపులేకపోవడం ఆశ్చర్యం. ఐఎమ్​డీఈఏ నెట్​వర్క్స్​ ఇనిస్టిట్యూట్​లో‘ప్రీ ఇన్​స్టాల్డ్​ ఆండ్రాయిడ్​ సాఫ్ట్​వేర్​’పై పబ్లిష్ అయిన ఓ రీసెర్చ్​ పేపర్​ ప్రీ ఇన్​స్టాల్డ్​ సాఫ్ట్​వేర్లతో వచ్చే పెద్ద చిక్కులను వెలుగులోకి తెచ్చింది.

ఏ డేటాను సేకరిస్తున్నాయి?
ప్రీఇన్​స్టాల్డ్​ యాప్స్​కు మరే ఇతర యాప్స్​కు లేని ఫీచర్స్​ను యాక్సెస్​ చేసే అనుమతి ఉంటుంది. దీనివల్ల యాప్స్​ను ఇన్​స్టాల్​ చేసి ఇచ్చిన వారు ఎప్పుడైనా వీటి ద్వారా యూజర్లకు చెందిన సున్నితమైన సమాచారాన్ని చూడగలిగే అవకాశం ఉంటుందని రీసెర్చ్​ పేపర్ వెల్లడించింది. వీటిలో లొకేషన్, మిగతా యాప్స్​ సమాచారం, పర్సనల్ విషయాలు తదితరాలు ఉంటాయని తెలిపింది. కొన్ని ప్రీ ఇన్​స్టాల్డ్​ యాప్స్​ను రూట్​నిక్​ అనే థర్డ్​ పార్టీ లైబ్రరీతో జతపరిచి ఉంచుతున్నారని, ఫలితంగా యూజర్ల సమాచారం తస్కరణకు గురవుతుందని చెప్పింది. 

ప్రీ–ఇన్​స్టాల్డ్ యాప్స్​ను ఆపేదెలా?
సరైన డేటా ప్రొటెక్షన్​ చట్టం లేకపోవడం వల్లే యాప్స్​ను రెగ్యులేట్​ చేయలేకపోతున్నామని రీసెర్చ్ పేపర్​ తెలిపింది. మొబైల్​ తయారీ కంపెనీలు రకరకాల చిన్న సంస్థలతో కూడి పని చేస్తుండటం వల్ల ప్రీ ఇన్​స్టాల్డ్​ యాప్స్​ను ఎవరు తయారు చేస్తున్నారన్న విషయాన్ని కనిపెట్టడం కష్టతరం అవుతోందని చెప్పింది. 

దక్షిణ కొరియా ప్రీ ఇన్​స్టాల్డ్​ యాప్స్​ను నిషేధించినట్లు వివరించింది. ఈ మేరకు తయారీదారులకు ఆంక్షలు పెట్టిందని వెల్లడించింది. దీని వల్ల ప్రీ ఇన్​స్టాల్డ్​ యాప్స్​ను డిలీట్​ చేసుకునే వెసులుబాటు వినియోగదారుడికి కలుగుతుంది. వైఫై కనెక్టవిటీ, ఎన్​ఎఫ్​సీ, కస్టమర్​ సర్వీసు యాప్​, ప్లే స్టోర్​లను మాత్రమే డిలీట్​ ఆప్షన్​ లేకుండా రిలీజ్ చేసేందుకు అంగీకారం తెలిపింది. చైనా కూడా దక్షిణ కొరియా బాటలోనే నడుస్తోంది. అమెరికా, యూరప్​లలో మాత్రం ఇలాంటి రూల్స్​ ఏవీ లేవు. కానీ వాటికి బలమైన డేటా ప్రొటెక్షన్​ చట్టాలు ఉన్నాయి.

ఇండియా ఏం చేయాలి?
ఇండియాలో ప్రస్తుతం ఎలాంటి డేటా ప్రొటెక్షన్​ చట్టాలు లేవు. ఫలితంగా ప్రీ ఇన్​స్టాల్డ్​ యాప్స్​ వల్ల భారతీయులకు పెనుప్రమాదం పొంచి ఉంది. దక్షిణ కొరియాను పోలిన చర్యలు మన దేశంలోనూ అమల్లోకి తేవాలి. మొబైల్​ యాప్స్​ పనితీరుపై అవగాహన తక్కువగా ఉన్న సగటు భారతీయుడికి డిలీట్​ ఆప్షన్ సరిపోదు. అందుకే యూజర్ల నుంచి ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తున్నారు, దాన్ని ఎవరెవరితో పంచుకుంటున్నారన్న దానిపై మొబైల్​ తయారీదారుల నుంచి సమాచారం రాబట్టాలి. దీని వల్ల ఏయే యాప్స్​ను వాడాలన్న దానిపై వినియోగదారులకు అవగాహన కలుగుతుంది.

>
మరిన్ని వార్తలు