ఏసీబీకి దర్యాప్తు అధికారం లేదు

19 Aug, 2014 22:34 IST|Sakshi
ఏసీబీకి దర్యాప్తు అధికారం లేదు

గ్యాస్ ధర నిర్ణయంలో అవకతవకల కేసు
కోర్టుకు తెలియజేసిన ఢిల్లీ సర్కారు

 
సాక్షి, న్యూఢిల్లీ: కేజీ బేసిన్‌లో లభించే గ్యాస్ ధర పెంపులో అవకతవకలకు సంబంధించి దర్యాప్తు జరిపే అధికారంఅవినీతి  నిరోధక  బ్యూరో (ఏసీబీ)కి లేదని ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం ఢిల్లీ  హైకోర్టుకు తెలియజేసింది. కేంద్రం  ఇటీవల జారీ చేసిన నోటిఫికేషతో ఏసీబీ ఈఅధికారాన్ని కోల్పోయిందని ఢిల్లీ ప్రభుత్వం,ఏసీబీ తరపున న్యాయస్థానానికి హాజరైన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తెలిపారు. ‘జూలై 23వ తేదీన కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన ప్రకారం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసే అధికారం ఏసీబీకి లేదు. అవినీతి కేసుల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులపై దర్యాప్తు జరిపే అధికారాన్ని ఈ నోటిఫికేషన్ ఏసీబీ పరిధి నుంచి తొలగించింది.
 
ఢిల్లీ ప్రభుత్వ అధికారులు, ఉ ద్యోగులపై దర్యాప్తు జరిపే అధికారాన్ని మాత్రమే  ఏసీబీకి మిగిల్చింది’ అని సింగ్ న్యాయస్థానానికి తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ నవంబర్ 8, 1993న జారీ చేసిన నోటిఫికేషన్‌ను  కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ సవరించింది. తాజా నోటిఫికేషన్ ఏసీబీ దర్యాప్తు అధికారాన్ని ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే  పరిమితం చేసింది. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ నేపథ్యంలో తాజా సమాధానం ఇవ్వడానికి తనకు మరికొంత సమయం కావాలని ఏసీబీ... న్యాయస్థానాన్ని కోరింది. తాజా పరిణామాల నేపథ్యంలో  కొత్తగా సమాధానాన్ని ఇవ్వడానికి ఏసీబీకి, ఢిల్లీ ప్రభుత్వానికి సమయాన్ని ఇస్తూ న్యాయమూర్తి  వీకే శాలి నేతృత్వంలోని ధర్మాసనం కేసుపై విచారణను అక్టోబర్ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
 
ఢిల్లీ ప్రభుత్వం ఏసీబీ సమాధానాలకు రిలయెన్స్, ఇతరులు తదుపరి విచారణ తేదీలోగా సమాధానాలు సమర్పించాల్సి ఉంటుంది. ఫిర్యాదుదారుల తరపున న్యాయస్థానానికి హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ దాని దృష్ట్యా  టెరిటోరియల్ జ్యురిస్‌డిక్షన్ పరంగా తన పరిధిలో జరిగిన అవినీతి కేసులపై  దర్యాప్తు జరిపే అధికారం ఏసీబీకి ఉందని వాదించారు. గ్యాస్ ధర పెంపులో అవకతవకలు జరిగాయనే ఫిర్యాదుల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని అప్పటి ఢిల్లీ ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా ఏసీబీని ఆదేశించింది. తనపై అవినీతి ఆరోపణలు దురుద్దేశంతో కూడినవని, అటువంటి  ఆరోపణలపై  ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసే అధికారం ఏసీబీకి లేదని, అందువల్ల ఎఫ్‌ఐఆర్‌ను  కొట్టివేయాలని రిలయెన్స్ అంతకుముందు న్యామస్థానాన్ని కోరింది. అయితే   గ్యాస్‌ధరల పెంపులో అవకతవకల కేసులో మాజీ కేంద్ర మంత్రి  వీరప్ప  మొయిలీతో పాటు రిలయెన్స్‌పైనా, ఇతరులపైనా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసే అధికారం తనకు ఉందని ఏసీబీ న్యాయస్థానానికి తెలియజేసింది.
 
అవమానకరమైన రాజీయే
ఏసీబీ విచారణ పరిధి అంశంపై ఆప్
న్యూఢిల్లీ: ఏసీబీ పరిధి వ్యవహారంలో ఢిల్లీ ప్రభుత్వ వైఖరికి సంబంధించి బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తప్పుపట్టింది. ఇది అవినీతితో అవమానకరమైన రీతిలో రాజీపడడమేనని అభివర్ణించింది. రిలయన్స్ సంస్థతోపాటు యూపీఏ మాజీ మంత్రులను కాపాడే ప్రయత్నమని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించింది. ఏసీబీ అధికార పరిధుల విషయంలో బీజేపీ నియంత్రింత ఢిల్లీ ప్రభుత ్వం హైకోర్టుకు ఇచ్చిన జవాబు... అవినీతితో రాజీకి ఉదాహరణగా అభివర్ణించింది.
 
ఉద్దేశపూర్వకంగానే ఏసీబీ అధికారాలకు కత్తెర వేస్తున్నారని ఆరోపించింది. అర్థరహితమైన వ్యవస్థగా ఏసీబీని మార్చేందుకు జరుగుతున్న కుట్రగా అభివ ర్ణించింది. రూ. 54 వేల కోట్ల ఈ భారీ కుంభకోణంలో యూపీఏ మాజీ మంత్రుల హస్తముందని ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబంధించి సమగ్ర దర్యాప్తు అవసరమని ఏసీబీ తన 32 పేజీల అఫిడవిట్‌లో కోర్టుకు నివేదించిందని, ఇటువంటి పరిస్థితుల్లో దాని అధికారాలకు పరిమితులు విధించడం అర్థరహితమని పేర్కొంది.

మరిన్ని వార్తలు