‘తాజ్‌’అందాలు వీక్షించిన ట్రంప్‌ దంపతులు

24 Feb, 2020 17:43 IST|Sakshi

తాజ్‌మహల్‌లో ట్రంప్‌ కుటుంబం

ఆగ్రా: తొలిసారి భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సతీసమేతంగా తాజ్‌మహల్‌ను సందర్శించారు. భార్య మెలానియా ట్రంప్‌తో కలిసి తాజ్‌మహల్‌ పరిసరాల్లో అడుగుపెట్టిన ట్రంప్‌.. తొలుత సందర్శకుల పుస్తకంలో(విజిటర్‌ బుక్‌)లో సంతకం చేశారు. ‘‘తాజ్‌మహల్‌ అద్భుతం. అందమైన భారత సంస్కృతికి నిదర్శనం! థ్యాంక్యూ ఇండియా’’అని ఆయన రాశారు.ప్రపంచ వింతగా ప్రఖ్యాతి గాంచిన తాజ్‌మహల్‌ విశేషాలను గైడ్‌ వివరిస్తుండగా.. ట్రంప్‌ దంపతులు ఆసక్తిగా ఆలకించారు. సంధ్యాసమయంలో చేతిలో చెయ్యి వేసుకుని పచ్చటి లాన్‌లో నడుచుకుంటూ మహత్తర కట్టడాన్ని చేరుకున్నారు. ఫొటోలకు పోజులిస్తూ.. ‘ప్రేమచిహ్నం’ అందాలను వీక్షిస్తూ.. ఆహ్లాదంగా గడిపారు. అనంతరం తాజ్‌మహల్‌ లోపలికి ప్రవేశించి.. షాజహాన్‌, ముంతాజ్‌ సమాధులను సందర్శించారు. ఇక ట్రంప్‌, మెలానియాది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. (చదవండి : ట్రంప్‌ దంపతుల లవ్‌ స్టోరీ)

ఇక ట్రంప్‌ కుటుంబం తాజ్‌ మహల్‌ సందర్శన నేపథ్యంలో ఆగ్రా పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా అహ్మదాబాద్‌లో జరిగిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమానికి హాజరైన అనంతరం ట్రంప్‌ ఆగ్రాకు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందిబెన్‌పటేల్‌ ట్రంప్‌ కుటుంబానికి ఎయిర్‌పోర్టులో  ఘన స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు