భారత్‌తో ఒప్పందం కుదిరింది: ట్రంప్‌

25 Feb, 2020 14:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం తన జీవితంలో గొప్ప విషయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అదే విధంగా ప్రపంచంలోనే అత్యద్భుతమైన తాజ్‌మహల్‌ను సందర్శించడం గొప్ప అనుభూతి కలిగించిందని హర్షం వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీకి చేరుకున్న ట్రంప్‌ దంపతులు తొలుత రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం రాజ్‌ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించి.. ఆ తర్వాత హైదరాబాద్‌ హౌజ్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. తనకు అద్భుత స్వాగతం పలికిన ప్రధాని మోదీ, భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. భారత పర్యటనలో భాగంగా అత్యాధునిక సాంకేతికత కలిగిన అపాచీ, రోమియో హెలికాప్టర్ల కొనుగోలుతో పాటు.. 3 బిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు.(21 వ శతాబ్దంలోనే ఇదొక కీలక ఘట్టం : మోదీ)

ఈ సందర్భంగా... ఉగ్రవాదాన్ని పెంచి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ను భారత గడ్డపై నుంచి ట్రంప్‌ హెచ్చరించారు. ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేస్తున్నామని... అతివాద ఇస్లామిక్‌ ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. అదే విధంగా భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు ట్రంప్‌ తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా భారత్‌- అమెరికా సంబంధాలు బలపడ్డాయన్న అగ్రరాజ్య అధ్యక్షుడు.. ఢిల్లీలో ఐరాస డెవలప్‌మెంట్‌ ఫండ్‌ శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు మరోమారు ప్రెస్‌తో మాట్లాడతానని ట్రంప్‌ పేర్కొన్నారు. (హైదరాబాద్‌ హౌజ్‌లో మోదీ-ట్రంప్‌ చర్చలు)

ట్రంప్‌ భారత పర్యటన: వరుస కథనాల కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు