ఇలాచేస్తే.. షిర్డీలో ఏడాదిపాటు వీఐపీ దర్శనం

22 Jun, 2017 11:31 IST|Sakshi
ఇలాచేస్తే.. షిర్డీలో ఏడాదిపాటు వీఐపీ దర్శనం
ముంబయి: ప్రసిద్ధ షిర్డీ ఆలయంలో సాయిబాబా దర్శనం కోసం క్యూలో నిల్చొని విసిగి పోయారా.. మీరు కూడా వీఐపీ దర్శనం కోరుకుంటున్నారా అయితే, మీకు ఇక ఆ చింతన అక్కర్లేదు. ఏం చక్కా ప్రతి ఒక్కరూ వీఐపీలాగే షిర్డీ సాయినాధున్ని దర్శించుకునే అవకాశాన్ని షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ కల్పిస్తోంది. అయితే, మీరు చేయాల్సిందల్లా కూడా ఒక్కటే.. అదే రక్తదానం. అవును.. షిర్డీ సాయినాధుని దర్శనానికి వెళ్లిన వారు రక్తదానం చేయడం ద్వారా ఒక ఏడాదిపాటు ఆలయంలో వీఐపీ హోదాలో దర్శనం ఉండటంతోపాటు సత్రాల్లో బస విషయంలో కూడా వీఐపీ తరహాలోనే ఏర్పాటుచేస్తారు.

సర్వ మానవ శ్రేయస్సు కోసం ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ట్రస్టు చైర్మన్‌ సురేశ్‌ హారే మీడియాకు తెలిపారు. షిర్డీని బ్లడ్‌ బ్యాంక్‌ హబ్‌గా మార్చడం తమ ఉద్దేశమని చెప్పారు. ‘తిరుమల తిరుపతిలో తలనీలాలు సమర్పించినట్లే. షిర్డీకి వచ్చినవారు రక్తదానం చేయడం ఆనవాయితీగా మారుస్తాం’  అని ఆయన చెప్పారు. రక్తదానం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భక్తులు ఈ చర్యతో మానవతా దృక్పథాన్ని చాటుకోవడంతోపాటు ఒక మంచి పనిచేశామని సంతృప్తి కూడా దక్కనుంది.
మరిన్ని వార్తలు