పుణె : దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులు ఆగే వరకు, సమాజంలో ఈ భయానకమైన పరిస్థితులు మారే వరకు ఎవరూ పిల్లల్ని కనొద్దంటూ రుక్సర్ రెహమాన్ అనే నటి పిలుపునిచ్చారు. దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న దాడులను ఆమె ‘జంతు ప్రవర్తన’తో పోల్చారు. సమాజంలోని ఈ పరిస్థితులను చూస్తుంటే తన 22 ఏళ్ల కూతురు బయటికి వెళ్లిన ప్రతిసారి తాను ఆందోళనకు గురౌతున్నట్టు తెలిపారు. అందుకోసమే సమాజం మారేవరకూ ఎవరు పిల్లల్ని కనకండి అంటూ పిలుపునిచ్చారు.
ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి ఆందోళన, ఆవేదన ఆమె మాటల్లోనే.. ‘ఉత్తరప్రదేశ్లోనైన, కశ్మీర్లోనైన, చివరకూ పాకిస్తాన్లోనైన అత్యాచారం జరిగితే ఒక అమ్మగా, ఒక మహిళగా అవి నన్ను బాధిస్తాయి. నా 22 ఏళ్ల కూతురు బయటికి వెళ్లిన ప్రతిసారి నేను భయపడుతుంటాను. ఈ సమాజ ఆలోచన విధానం, ప్రవర్తన మారనంత వరకూ బేటీ బచావో, బేటీ పడావో లాంటి కార్యక్రమాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. రుక్సర్ 1992లో తన 17 ఏళ్ల వయసులో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ‘కుచ్ తో లోగ్ కహెంగే’ ‘తుమారి పాకీ’ ‘అవుర్ ప్యార్ హొగయా’ లాంటి టీవీ షోలలో కూడా నటించారు. అలాగే ‘సర్కర్’, ‘షైతాన్’, మొన్నామధ్య వచ్చిన ఆమిర్ ఖాన్ ‘పీకే’ సివిమాలో కూడా రుక్సర్ నటించారు.