మన దేశంలో సగటున రోజుకు 400 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. అయితే, ప్రస్తుతం అంతా ఆవుల సీజన్ నడుస్తోంది. ఏదైనా ఘటనకు ఆవుతో సంబంధం ఉందంటే చాలు.. ఒక్కసారిగా అది ప్రధాన వార్తల్లోకి ఎక్కేస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో ఇలాంటిదే ఓ ప్రమాదం సంభవించింది. పోలీసు జీపు నడుపుతున్న డ్రైవర్కు రోడ్డుమీద ఉన్నట్టుండి ఓ ఆవు అడ్డొచ్చింది. దాన్ని కాపాడేందుకు సడన్గా అతడు స్టీరింగ్ను పక్కకు తిప్పాడు.
అయితే అదే సమయానికి ఆ పక్కనే ఓ వృద్ధురాలు కూడా ఉంది. ఆమెను చూసేసరికే జీపు అతడి అదుపు తప్పి.. ఆమెను ఢీకొంది. ఆమెతో పాటు ఆమె పక్కనే ఉన్న ముగ్గరు మనవలు కూడా గాయపడ్డారు. వారిలో వృద్ధురాలు ఉషాదేవి (60) అక్కడికక్కడే మరణించారు. పిల్లలు ముగ్గురినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. జీపు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.