‘దావూద్ కాదు, నాయక్ ను పట్టుకోండి’

11 Jul, 2016 12:36 IST|Sakshi
‘దావూద్ కాదు, నాయక్ ను పట్టుకోండి’

ముంబై: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ వెంట పడడం మానేసి వివాదస్పద ఇస్లామిక్ స్కాలర్, టెలీ మత బోధకుడు జకీర్ నాయక్ ను అరెస్ట్ చేయాలని శివసేన డిమాండ్ చేసింది. ‘పాకిస్థాన్ నుంచి దావూద్ లేదా మెమన్ రప్పిస్తాం లాంటి ప్రకటనలు మానేయండి. జకీర్ నాయక్పై దృష్టి పెట్టండి. స్వదేశంలోనే నక్కిన శత్రువును అరెస్ట్ చేయండి. 26/11 దాడి కేసులో సజీవంగా పట్టుబడిన అజ్మల్ కసబ్ ను ఉంచిన జైలు గదిలో జకీర్ ను పడేయండ’ని కేంద్ర ప్రభుత్వాన్ని శివసేన డిమాండ్ చేసింది.

దేశంలో వేర్పాటువాదులను రెచ్చగొట్టేలా జకీర్ నాయక్ ప్రసంగాలు, ప్రచారం ఉందని ‘సామ్నా’లో శివసేన పేర్కొంది. ముస్లిం యువతను హింసవైపు ప్రేరేపిస్తూ దేశంలో కొత్త తరహా అశాంతికి కారణమవుతున్నారని ఆరోపించింది. విదేశాల నుంచి నల్లధనాన్ని వెలికితీసే చర్యలను వాయిదా వేసి, జకీర్ నాయక్ కు నిధులు సమకూరుస్తున్న వారిని పట్టుకోవాలని కేంద్రానికి శివసేన సూచింది. విదేశీ పర్యటన నుంచి తిరిగిరాగానే జకీర్ నాయక్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.

మరిన్ని వార్తలు