సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారిని ఈ భూమి మీద నుంచి తరిమికొట్టడానికి అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరం భూమాతకి కృతజ్ఞతలు తెలుపుదామని ఆయన బుధవారం ట్వీట్ చేశారు. ‘అపారమైన ప్రేమతో సమస్త జీవకోటిని కంటికి రెప్పలా కాపాడుతున్న భూమాతకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. మనకు రక్షణ కల్పిస్తున్న భూమాతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. భూగ్రహాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా, అంత్యంత శ్రేయస్కరంగా ఉండేలా చూసుకుంటామని ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేద్దాం’ అని ప్రధాని పిలుపునిచ్చారు. (జన విశ్వాసమే మోదీ ఆయుధం)
1970 ఏప్రిల్ 22న మొదటి ‘ఎర్త్ డే'ను నిర్వహించటం జరిగిందని, పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ప్రధాని పేర్కొన్నారు. కాగా పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజాన్ని జాగృత పరిచే క్రమంలో ఏటా ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహించటం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. (పుడమి తల్లికి ప్రణామం)
On International Day of Mother Earth, we all express gratitude to our planet for the abundance of care & compassion. Let us pledge to work towards a cleaner, healthier & more prosperous planet.
A shout out to all those working at the forefront to defeat COVID-19. #EarthDay2020
— Narendra Modi (@narendramodi) April 22, 2020
ప్రకృతిని ప్రేమిద్దాం: ఉప రాష్ట్రపతి
ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈ నేలను, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరం కంకణబద్ధులం కావాలి. మన పెద్దలు మనకు అందించిన స్వచ్ఛమైన పర్యావరణాన్ని, యథావిధిగా మన ముందు తరాలకు అందించేందుకు ప్రతిన బూనాల్సిన అవసరం ఉంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉంటూనే ప్రకృతితో మమేకమయ్యే దిశగా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ప్రకృతిని ప్రేమిద్దాం. ప్రకృతితో కలిసి జీవిద్దాం. ఆరోగ్యవంతమైన సమాజం కోసం పునరంకితమౌదాం.’ అని పిలుపునిచ్చారు.