సీఎం భార్యకు నోటీసులు

8 May, 2016 13:54 IST|Sakshi

షిల్లాంగ్: మేఘాలయ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా భార్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. తురాలో ఈ నెల 16న జరగనున్న ఉప ఎన్నికల ప్రచారం కోసం ఆయా సభల్లో పాల్గొన్న సంగ్మా భార్య డికాంచీ డి షిరా బీజేపీకి వ్యతిరేకంగా, అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకుగానీ వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపించింది. ప్రచారంలో పాల్గొన్న సంగ్మా.. నేషనల్ పీపుల్స్ పార్టీకి బీజేపీకి మధ్య ఒప్పందం జరిగిందని, బీజేపీ ఎజెండా మేరకే ఎన్ పీపీ పనిచేస్తుందని, మైనారిటీలకు బీజేపీ రక్షణ కల్పించలేదంటూ కొంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

అయితే, ఈ మాటలను నేరుగా మీడియా నుంచి సుమోటోగా తీసుకున్న ఈసీ ఆమెకు నోటీసులు పంపించారు. దీనిపై ఆమెను వివరణ కోరగా తమ స్థానిక భాష మీడియాకు అర్థంకాగ తప్పుగా రాసిందని, తానేం అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. తురా స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ తరుపున డికాంచి డీ షిరా పోటీ చేస్తుండగా.. ఎన్ పీపీ నుంచి లోక్ సభ మాజీ స్పీకర్ పుర్నో ఏ సంగ్మా కుమారుడు కాన్ రాడ్ కే సంగ్మా పోటీ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు