డిగ్గీరాజా కోసం పూజలు; ఈసీ ఆదేశాలు

9 May, 2019 10:53 IST|Sakshi

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, భోపాల్‌ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్‌ సింగ్‌ విజయాన్ని ఆకాంక్షిస్తూ నామ్‌దేవ్‌ త్యాగి అలియాస్‌ కంప్యూటర్‌ బాబా హఠ యోగ నిర్వహించిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రఙ్ఞాసింగ్‌ ఠాకూర్‌ ఓటమిని ఆకాంక్షిస్తూ మూడు రోజుల పాటు తలపెట్టిన ఈ కార్యక్రమంలో సుమారు ఏడు వేల మంది సాధువులు పాల్గొన్నారు. అదే విధంగా దిగ్విజయ్‌ సింగ్‌కు ఓటు వేయాలంటూ వందల మంది సన్యాసులు ప్రజలను కోరుతారని కంప్యూటర్‌ బాబా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంప్యూటర్‌ బాబా కార్యకలాపాలపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. భోపాల్‌ జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల కమిషనర్‌కు ఈ విషయమై లోతుగా దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీచేసింది. ఈ పూజా కార్యక్రమాలకు కంప్యూటర్‌ బాబాకు అనుమతి ఎవరు ఇచ్చారు.. తన విజయం కోసం దిగ్విజయ్‌ సింగే సాధువులను ఆహ్వానించారా... ఏ పార్టీ కోసం బాబా ప్రచారం చేస్తున్నారు.. అందుకు ఎంత మొత్తం అంతదుకుంటున్నారు.. పూజా కార్యక్రమాలకు అయ్యే ఖర్చు ఎంత తదితర అంశాలపై విచారణ చేపట్టాల్సింగా పేర్కొంది.

కాగా మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సీఎంగా ఉన్న సమయంలో మంత్రి హోదాను అనుభవించిన కంప్యూటర్‌ బాబా..ప్రస్తుతం అభ్యర్ధి దిగ్విజయ్‌ సింగ్‌ గెలుపు కోసం పూజలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి వందలాది సన్యాసులతో భోపాల్‌లోని సైఫియా కాలేజ్‌ మైదానంలో ఆయన ఈ పూజలు జరిపారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం ఐదేళ్లలో రామ మందిరం నిర్మించలేదని, మందిర్‌ లేకుండా నరేంద్ర మోదీ కూడా ఉండటానికి వీల్లేదని కంప్యూటర్‌ బాబా మండిపడ్డారు. కాషాయ వస్ర్తాలను ధరించినందుకే ప్రజ్ఞా సింగ్‌ను సాధ్విగా పిలవడం తగదని అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలతో ఆమెకు సంబంధం ఉందని, హత్య కేసులోనూ ఆమె నిందితురాలని కంప్యూటర్‌ బాబా ఆరోపించారు.

>
మరిన్ని వార్తలు