చూడచక్కని జంట.. ఆకుపచ్చని పెళ్లి

24 Jun, 2018 13:17 IST|Sakshi

పర్యావరణ హితంగా వివాహం

జీరో ప్లాస్టిక్‌.. ఆడంబరాలు లేవు

సాక్షి, ముంబై: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర ఙ్ఞాపకం. అలాంటి వేడుకను ప్రస్తుత తరంవారు విభిన్నంగా, అందరూ మెచ్చుకునేలా, అందరినీ ఆలోచింపజేసేలా జరుపుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం అలాంటి ప్రయత్నమే చేశారు ముంబైకి చెందిన దీపా కామత్‌, ప్రషిన్‌ జాగర్‌ జంట.

వివాహం అనగానే పెళ్లి పత్రికల నుంచి మొదలు డెకరేషన్స్‌, భోజనాలు చేసే ప్లేట్లు, గ్లాస్‌ల దాకా పర్యావరణానికి విఘాతం కలిగించేవే. ప్రకృతికి నష్టం కలిగించే ఇలాంటి వస్తువులేవీ వాడకుండా.. పర్యావరణ హితంగా తమ పెళ్లి ఉండాలని వారు కోరుకున్నారు. తమ సాదాసీదాగా వినూత్న వివాహానికి పెద్దలను, స్నేహితులను ఒప్పించారు. వారి సహకారంతో పర్యావరణానికి అనుకూలమైన, రీసైక్లింగ్‌ (జీరో ప్లాస్టిక్‌)వస్తువులనే వాడాలని, ఆఖరికి టిష్యూ పేపర్‌ కూడా వాడకూదని(పేపర్‌ చెట్ల నుంచి వస్తుందని) నిర్ణయించుకున్నారు.

వివాహ ఆహ్వానానికి పత్రికల బదులు వాట్సప్‌ మెసేజ్‌, దగ్గరి బంధువులను కలిసి ఆహ్వానం చెప్పివచ్చారు. భోజనాలు వడ్డించేందుకు ప్లాస్టిక్‌ ప్లేట్లకు బదులు పాత పద్ధతి పళ్లాలు వాడారు. వీరనుకున్నంత సులభంగా ఈ పనులు జరగలేదు. ఎన్నో అడ్డంకులు, బంధువుల నుంచి వ్యతిరేకత వీటన్నింటినీ అధిగమించి, ప్రకృతి ఒడిలో అందరినీ ఆలోచింపజేసాలా వీరి వివాహ వేడుక జరిగింది. వీరి పర్యావరణ అనుకూల వివాహం ఇప్పుడు సోషల్‌ మీడియాలో నెటిజన్లు హృదయాలను గెలుచుకుంటోంది.

మరిన్ని వార్తలు